కడప జిల్లాలో టూరిస్టు బస్సు బోల్తా .. తప్పిన పెనుప్రమాదం

  • జమ్మలమడుగు - కన్యతీర్థం ప్రధాన రహదారిపై ఘటన
  • స్టీరింగ్ పని చేయకపోవడంతో టూరిస్ట్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన బొల్తా కొట్టిన వైనం
  • తొమ్మిది మంది భక్తులకు గాయాలు
కడప జిల్లాలో పెనుప్రమాదం తప్పింది. 40 మంది భక్తులతో వెళుతున్న టూరిస్టు బస్సు జమ్మలమడుగు - కన్యతీర్థం ప్రధాన రహదారిపై ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తొమ్మిది మంది భక్తులు గాయపడ్డారు. 

వివరాల్లోకి వెళితే..అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నుంచి ప్రైవేటు బస్సులో 40 మంది భక్తులు జమ్మలమడుగు మండలం కన్యతీర్థం దర్శనానికి వెళ్లారు. మధ్యాహ్నం భోజనం అనంతరం అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని ఆలూరు రంగనాయకుల కోనకు బయలుదేరారు. ఈ క్రమంలో కొత్తగుంటపల్లె సమీపంలోని మలుపు వద్ద బస్సు స్టీరింగ్‌ అకస్మాత్తుగా పనిచేయకపోవడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. 

ఈ ప్రమాదంలో రైల్వేకోడూరుకు చెందిన తొమ్మిది మంది భక్తులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని 108 అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణపాయం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 
 


More Telugu News