క్లాస్‌రూంలో దారుణం.. క్లాస్‌మేట్‌ను కాల్చి చంపి.. తనూ కాల్చుకున్న విద్యార్థి

  • పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లాలో ఘటన
  • క్లాస్‌మేట్‌ను తుపాకీతో కాల్చి చంపిన మొదటి సంవత్సరం లా విద్యార్థి
  • అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యాయత్నం
  • ఘటనా స్థలంలోనే విద్యార్థిని మృతి.. యువకుడి పరిస్థితి విషమం
  • సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఘటన
పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లాలో ఓ లా కాలేజీలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఓ యువకుడు తనతో పాటు చదువుతున్న విద్యార్థినిని తరగతి గదిలోనే తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, నిందితుడైన యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ భయానక దృశ్యాలన్నీ క్లాస్‌రూంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మృతురాలిని నౌషెహ్రా పన్నువాన్ గ్రామానికి చెందిన సందీప్ కౌర్‌గా, నిందితుడిని జలంధర్ జిల్లా మల్లియాన్ గ్రామ వాసి ప్రిన్స్ రాజ్‌గా గుర్తించారు. వీరిద్దరూ ఉస్మా గ్రామంలోని ఒక లా కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నారు.

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఉదయం 9:15 గంటల సమయంలో ప్రిన్స్ రాజ్ క్లాస్‌లోకి వచ్చాడు. సందీప్ కౌర్ అతడిని చూసి ఏదో అనగా, అతడు ఆమె వెనకే వెళ్లాడు. కాసేపటికి రాజ్ తన బ్యాగ్‌లోంచి పిస్టల్ తీసి, నిలబడి ఉన్న సందీప్ కౌర్ తలలో కాల్చాడు. ఆ తర్వాత కొన్ని అడుగులు ముందుకు వేసి తన తలలోకి కూడా కాల్చుకున్నాడు. ఈ ఊహించని ఘటనతో తోటి విద్యార్థులు షాక్‌కు గురై భయంతో పరుగులు తీశారు.

ప్రిన్స్ రాజ్ ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.


More Telugu News