మోదీ కచ్చితంగా బడాబాయే.. టీన్యూస్ జర్నలిస్టు ముఖంలో కేసీఆర్‌ను చూడలేను కదా: రేవంత్ రెడ్డి

  • ఆయన దేశానికి ప్రధానమంత్రి కాబట్టి బడాబాయే అన్న రేవంత్ రెడ్డి
  • బీఆర్ఎస్ నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • ఈగిల్ టీమ్‌కు చెప్పవలసి వస్తుందేమోనన్న ముఖ్యమంత్రి
నరేంద్ర మోదీ దేశానికి ప్రధానమంత్రి కాబట్టి ఆయన కచ్చితంగా బడాబాయినే అని, ముఖ్యమంత్రి చోటాబాయి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని బడాబాయి అన్నారు కదా అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, ముఖ్యమంత్రి స్పందించారు.

ప్రధాని కాబట్టి ఆయన బడాబాయే అని చెప్పారు. ఇంగ్లీష్‌లో బిగ్ బ్రదర్ అంటారని, తాను హిందీలో చెప్పానని అన్నారు. 'మీరు టీ న్యూస్ జర్నలిస్టు అయినంత మాత్రాన మీ ముఖంలో నేను కేసీఆర్‌ను చూడను కదా. జర్నలిస్టుగానే చూస్తాను. అలాగే ప్రధానిని ప్రధానిగానే చూస్తాను.. ఆయన పెద్దన్నే' అని అన్నారు. మీ సారంతా ఇంగ్లీష్ నాకు రాదంటూ టీన్యూస్ జర్నలిస్టును ఉద్దేశించి ముఖ్యమంత్రి సరదాగా అన్నారు.

ఈగల్ టీమ్‌కు చెప్పాలేమో

పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ చేసిందేమీ లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ పదేళ్లు నిధులు, అధికారం వారి చేతిలోనే ఉందని, అప్పుడేం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని రావడం విడ్డూరంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల చేతుల్లోనే కీలక శాఖలు ఉన్నాయని గుర్తు చేశారు. వారు ఏ ఒక్క వర్గానికీ న్యాయం చేయలేదని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే వచ్చేదేమీ లేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ ఇప్పటి వరకు సభకు రాలేదని, ఇప్పుడు వార్డుల్లో బీఆర్ఎస్ వారిని గెలిపిస్తే వారు అభివద్ధిని అడ్డుకుంటారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకుల్లో అహంకారం, విషం చిమ్మడం, విద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే మాటలు తప్ప ఏమీ లేదని అన్నారు. వారు స్థాయి మరిచి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, చూస్తుంటే వారి గురించి ఈగల్ టీమ్ గురించి చెప్పాలేమోనని అన్నారు. గంజాయి లేదా కొకైన్ తీసుకుని మాట్లాడుతున్నారా అని అడగాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. మానసిక రోగం, ఉన్మాదంతో అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేశారని అన్నారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయని అన్నారు.

బీఆర్ఎస్ 2014 నుంచి 2022 వరకు బీజేపీ తెచ్చిన ప్రతి చట్టానికి మద్దతు పలికిందని ఆరోపించారు. 2014 నుంచి 2021 వరకు రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేదని, కానీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు, జీఎస్టీ, నోట్ల రద్దు వంటి చట్టాలకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. నోట్ల రద్దు అద్భుతమని సభలో కేసీఆర్ చెప్పారని, జీఎస్టీని అభినందించారని అన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారని, కానీ చర్యలేమీ తీసుకోలేదని అన్నారు.


More Telugu News