అమృతాను మతం మారమనలేదు: సైఫ్ అలీ ఖాన్ ఆసక్తికర విషయాలు

  • మొదటి భార్య అమృతా సింగ్‌ను మతం మారమని ఎప్పుడూ బలవంతపెట్టలేదన్న‌ సైఫ్
  • విడాకుల తర్వాత పిల్లల మతపరమైన గుర్తింపుపై ఆందోళన చెందానని వెల్లడి
  • డిజైనర్లు అబూ జానీ, సందీప్ ఖోస్లా సాక్షులుగా రహస్యంగా జరిగిన సైఫ్-అమృతా వివాహం
  • నిఖా కోసం అమృతా పేరును ఆ క్షణంలో 'అజీజా'గా మార్చిన వైనం
  • మౌల్వీ, సిక్కు పూజారి ఇద్దరి సమక్షంలో వారి వివాహ వేడుక
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌ను 2012లో వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నప్పటికీ, తన మొదటి భార్య అమృతా సింగ్‌తో బంధం, విడాకులు, మతాంతర వివాహంలో ఎదురయ్యే సవాళ్ల గురించి మాట్లాడటానికి ఎప్పుడూ వెనుకాడరు. తాజాగా ఆయన గతంలో పంచుకున్న కొన్ని విషయాలు, వారి వివాహానికి సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.

సైఫ్ అలీ ఖాన్‌కు, అమృతా సింగ్‌కు మధ్య 13 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. వారిద్దరి ప్రేమ, హడావుడిగా జరిగిన పెళ్లి ఇప్పటికీ చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది. సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని పెళ్లి చేసుకున్న తర్వాత ఇస్లాం మతంలోకి మారారు. కానీ, సైఫ్ తన మొదటి భార్య అమృతాను మతం మారమని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. 2010లో 'ది సియాసత్ డైలీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "డింగీ (అమృతాను ఆయన అలా ముద్దుగా పిలుస్తారు)ని ఇస్లాంలోకి మారమని గానీ, ఆ మతాన్ని ఆచరించమని గానీ ఎన్నడూ బలవంతం చేయలేదు. మొదటి నుంచి ఎవరి మతం వారిదే అనే సూత్రాన్ని పాటించాం. మా పిల్లలు సారా, ఇబ్రహీం పెరుగుతున్నప్పుడు కూడా అదే విధానాన్ని కొనసాగించాను" అని వివరించారు.

అంతేకాదు "అమృతా సిక్కుల ప్రార్థనా మందిరమైన గురుద్వారాకు వెళ్లినప్పుడు, నేను పిల్లలను చూసుకునేవాడిని" అని సైఫ్ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అయితే, విడాకుల తర్వాత పిల్లల విషయంలో ఆందోళన చెందానని ఆయన ఒప్పుకున్నారు. "మేము విడిపోయినప్పుడు, పిల్లలు అమృతా దగ్గర ఉన్నారు. వారి మతపరమైన గుర్తింపు గురించి నాకు ఆందోళన ఉండేది. కానీ, అమృతాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆమె పిల్లలను మతపరంగా ప్రభావితం చేయదని నాకు తెలుసు" అని తెలిపారు.

మౌల్వీ, సిక్కు పూజారి సమక్షంలో పెళ్లి
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లా కలిసి ఇటీవల నమ్రతా జకారియా యూట్యూబ్ ఛానల్‌లో సైఫ్-అమృతా పెళ్లి నాటి రహస్యాలను పంచుకున్నారు. వారిద్దరి నిఖా నామాపై తామే సాక్షులుగా సంతకం చేశామని తెలిపారు. "ఒకరోజు వారు మా దగ్గరకు వచ్చి 'ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం' అన్నారు. సైఫ్ సిద్ధంగా ఉన్నాడు, కానీ అమృతా ఇంకా నిర్ణయించుకోలేదు. ఒక స్నేహితురాలి అపార్ట్‌మెంట్‌లో హడావుడిగా పెళ్లి ఏర్పాట్లు చేశాం. మేమే అమృతాను సిద్ధం చేశాం. ఒక మౌల్వీని, ఒక సిక్కు పూజారిని కూడా పిలిచాం" అని వారు వివరించారు.

"నిఖా సమయంలో మౌల్వీ, 'మీ పేరు 'A' అక్షరంతో మొదలవ్వాలి' అన్నారు. అప్పుడు అక్కడే ఉన్న పండిట్ 'అజీజా' అనే పేరును సూచించారు. అదంతా ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నట్టుగా ఉంది. ఆ తర్వాత అమృతా తల్లి ఫోన్ చేశారు. చివరికి అంతా సర్దుకుంది" అని అబు-సందీప్ ఆనాటి సంఘటనలను గుర్తుచేసుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే, సైఫ్ అలీ ఖాన్ త్వరలో రాహుల్ ధోలకియా దర్శకత్వంలో వస్తున్న 'హమ్ హిందుస్థానీ' అనే నెట్‌ఫ్లిక్స్ చిత్రంలో కనిపించనున్నారు.


More Telugu News