Shivam Mishra: బైక్‌ను ఢీకొట్టిన లంబోర్ఘిని.. 10 అడుగుల ఎత్తున గాల్లోకి ఎగిరిన యువకుడు

Kanpur Lamborghini Accident Youth Thrown 10 Feet in Air
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ లంబోర్ఘిని కారు బీభత్సం సృష్టించింది. మద్యం తాగిన మత్తులో ప్రముఖ పొగాకు వ్యాపారి కుమారుడు నడుపుతున్న ఈ విలాసవంతమైన కారు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. బైక్‌ను కారు ఢీకొట్టిన వేగానికి బైకర్ దాదాపు 10 అడుగుల ఎత్తున గాల్లోకి ఎగిరిపడటం గమనార్హం.

గ్వాల్‌టోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వీఐపీ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం 3:15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివమ్ మిశ్రా లంబోర్ఘిని కారును అత్యంత వేగంగా నడిపాడు. రెవ్-3 మాల్ సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పింది. తొలుత ఓ ఆటోరిక్షాను, ఆ తర్వాత పక్కన ఆపి ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బైక్ వద్ద ఉన్న వ్యక్తి గాల్లోకి ఎగిరిపడగా, మరికొందరికి గాయాలయ్యాయి. అనంతరం బైక్‌ను కొంతదూరం ఈడ్చుకెళ్లిన కారు, చివరకు ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగింది. ప్రమాదంలో మొత్తం ఆరుగురు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. "ప్రమాదంలో గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించాం. ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం," అని డీసీపీ (సెంట్రల్) అతుల్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే శివమ్ మిశ్రాను అతని వెనుకే మరో వాహనంలో వస్తున్న బాడీగార్డులు ఆసుపత్రికి తరలించారు. అయితే, నిందితుడు పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో పోలీసులు కేసు నమోదులో జాప్యం చేస్తున్నారని, రాజీ కోసం ఒత్తిడి తెస్తున్నారని బాధితులు, స్థానికులు పోలీస్ స్టేషన్ వద్ద ఆరోపించారు. పోలీసులు లంబోర్ఘిని కారును స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Shivam Mishra
Lamborghini accident
Kanpur accident
Uttar Pradesh accident
Road accident India
Car accident
Bike accident
KK Mishra
Gwaltoli police station

More Telugu News