నడిరోడ్డుపై మహిళను క‌ర్ర‌తో చితకబాదిన బీజేపీ నేత.. సోషల్ మీడియాలో వీడియో కలకలం!

  • మధ్యప్రదేశ్‌లో మహిళపై బీజేపీ నేత దాడి
  • సంతలో బండి పెట్టుకోవడంపై మొదలైన వివాదం
  • కర్రతో కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
  • బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
మధ్యప్రదేశ్‌లో ఓ బీజేపీ నేత నడిరోడ్డుపై ఒక మహిళపై కర్రతో దాడి చేసిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సిధి జిల్లా, సిహావల్ నియోజకవర్గంలోని బహ్రీ గ్రామంలో నిన్న‌ ఈ దారుణం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడిని బీజేపీకి చెందిన సంతోష్ పాఠక్‌గా, బాధితురాలిని హేమా సింగ్‌గా గుర్తించారు. హేమా సింగ్ బహ్రీ మార్కెట్‌లో చిన్న బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రాత్రికి రాత్రే తన బండిని, దుకాణాన్ని సంతోష్ పాఠక్ తొలగించాడని, దీనిపై తాను బహ్రీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని బాధితురాలు తెలిపారు.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం మార్కెట్‌లో బండి పెట్టుకునే విషయంలో ఇద్దరి మధ్య మళ్లీ వివాదం చెలరేగింది. వాగ్వాదం పెరగడంతో సంతోష్ పాఠక్ ఆమెపై కర్రతో దాడికి పాల్పడ్డాడు. అక్కడున్న వారిలో ఒకరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు బీఎన్ఎస్‌ కింద వివిధ సెక్షన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. "ఈరోజు నేను బండి పెట్టుకోవడానికి రాగానే సంతోష్ పాఠక్, మరొకరు వచ్చి నన్ను దూషించడం మొదలుపెట్టారు. ఆపమని కోరగా, ఈ ప్రాంతంలో తాను చెప్పిందే నడుస్తుందని బెదిరించాడు. 8-10 ఏళ్లుగా ఇక్కడే బండి నడుపుతున్నానని చెప్పినా వినకుండా కర్రతో కొట్టాడు" అని బాధితురాలు పోలీసులకు వివరించారు. అక్కడున్న వారెవరూ తనను కాపాడటానికి ముందుకు రాలేదని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా నిందితుడు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నిందితుడు సంతోష్ పాఠక్ స్థానిక సిహావల్ ఎమ్మెల్యే విశ్వామిత్ర పాఠక్‌కు సన్నిహితుడని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ఘటనపై ఎమ్మెల్యే గానీ, బీజేపీ గానీ అధికారికంగా స్పందించలేదు. పూర్తిస్థాయి విచారణ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


More Telugu News