సూర్యకుమార్ సంచలనం.. విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్!

  • విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టిన సూర్యకుమార్ యాదవ్
  • టీ20ల్లో 17వ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అందుకున్న సూర్య‌
  • ప్రపంచ జాబితాలో మూడో స్థానానికి చేరిన భారత కెప్టెన్
టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు శుభారంభం చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించడమే కాకుండా, ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా విరాట్ కోహ్లీని అధిగమించి చరిత్ర సృష్టించాడు.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరిగిన ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో, తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఒక దశలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 84 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నెమ్మదిగా ఉన్న పిచ్‌పై మొదట నిలకడగా ఆడి, ఆ తర్వాత అమెరికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని బాధ్యతాయుతమైన ఆటతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 161/9 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.

సూర్య అద్భుతం.. కోహ్లీ రికార్డు బద్దలు!
జట్టును ఆదుకున్న ఇన్నింగ్స్‌కు గానూ సూర్యకుమార్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఇది అతనికి అంతర్జాతీయ టీ20ల్లో 17వ అవార్డు. దీంతో 16 అవార్డులతో అగ్రస్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ రికార్డును అతను బద్దలుకొట్టాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (14) మూడో స్థానంలో ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, అత్యధిక టీ20 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డుల జాబితాలో సూర్య మూడో స్థానానికి చేరాడు. మలేషియాకు చెందిన వీరన్‌దీప్ సింగ్ (22), జింబాబ్వే ఆల్-రౌండర్ సికందర్ రజా (19) మాత్రమే అతని కంటే ముందున్నారు.


More Telugu News