టీమిండియాపై గుజరాత్ మంత్రి రివాబా జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు

  • టీ20 ప్రపంచకప్‌లో భారత్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన రివాబా జడేజా
  • గత కొన్నేళ్లుగా భారత జట్లు క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాయని ప్రశంస
  • అండర్-19 ప్రపంచకప్ గెలిచిన యువ జట్టుకు ప్రత్యేక అభినందనలు
  • ఈ యువ ఆటగాళ్లే దేశ భవిష్యత్తు అని కొనియాడిన గుజరాత్ మంత్రి
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026లో భారత జట్టు విజయం సాధిస్తుందని గుజరాత్ మంత్రి, క్రికెటర్ రవీంద్ర జడేజా అర్ధాంగి రివాబా జడేజా ధీమా వ్యక్తం చేశారు. ఈ మెగా టోర్నీలో బాగా ఆడాలంటూ టీమిండియాకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్‌కోట్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు.

"గత కొన్నేళ్లుగా భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. యువ ఆటగాళ్లు, దివ్యాంగుల జట్టు, ప్రపంచకప్ గెలిచిన మన మహిళల జట్టు.. ఇలా అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పుడు పురుషుల టీ20 ప్రపంచకప్ జరుగుతోంది. ఈ టోర్నీలో మన జట్టు కచ్చితంగా గెలుస్తుందని దేశం మొత్తం నమ్మకంతో ఉంది" అని రివాబా అన్నారు.

నిన్న అండర్-19 ప్రపంచకప్ గెలిచిన యువ భారత జట్టుకు ఆమె హృదయపూర్వక అభినందనలు తెలిపారు. "ఈ యువ క్రీడాకారులే దేశ భవిష్యత్తు. వాళ్లు చాలా చక్కగా ఆడుతున్నారు. వారి విజయం ఎంతో స్ఫూర్తిదాయకం" అంటూ యువ ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించారు.


More Telugu News