Chandrababu Naidu: చంద్రబాబు విజన్ అమోఘం... డబుల్ ఇంజిన్ సర్కారుకు ఆయనే నిదర్శనం: జితేంద్ర సింగ్

Chandrababu Naidu A Visionary Leader Says Jitendra Singh
  • అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుకు శంకుస్థాపన
  • సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
  • డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి చంద్రబాబే నిలువెత్తు నిదర్శనమని కితాబు
  • అమరావతి నుంచే భారత్ క్వాంటమ్ ప్రస్థానం ప్రారంభమవుతుందని ప్రకటన
  • రక్షణ, ఆరోగ్యం, కమ్యూనికేషన్ రంగాల్లో క్వాంటమ్ టెక్నాలజీ అత్యంత కీలకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక అద్భుతమైన దార్శనికుడని, ప్రధాని నరేంద్ర మోదీ చెప్పే "డబుల్ ఇంజిన్" ప్రభుత్వానికి ఆయనే అసలైన నిదర్శనమని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కొనియాడారు. చంద్రబాబు రేపటిలో జీవిస్తూ, ఎల్లుండి గురించి కలలు కంటారని ప్రశంసించారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమం కేవలం ఒక భవన నిర్మాణానికి కాదని, భారతదేశ క్వాంటమ్ భవిష్యత్తుకు పునాది అని ఆయన అభివర్ణించారు.

ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. చంద్రబాబు ముందుచూపు, పాలనా వేగాన్ని ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. "హైదరాబాద్‌లో అంతర్జాతీయ వైద్య సదస్సు నిర్వహించడానికి సరైన వేదిక లేనప్పుడు, హైటెక్ సిటీలోని కన్వెన్షన్ హాల్ గురించి తెలిసింది. అప్పుడే చంద్రబాబు దార్శనికత మాకు పరిచయమైంది. ఇప్పుడు ఏపీలో మరోసారి అదే వేగాన్ని చూస్తున్నాం. 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ సైన్సెస్ ప్రాజెక్టుకు ఈ ప్రభుత్వం వచ్చాక కేవలం కొన్ని నెలల్లోనే అన్ని అనుమతులు లభించాయి. గత శనివారమే ఆ కేంద్రాన్ని జాతికి అంకితం చేశాం. కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తే ఎంత వేగంగా అభివృద్ధి జరుగుతుందో చెప్పడానికి చంద్రబాబే సరైన ఉదాహరణ" అని ఆయన వివరించారు.

క్వాంటమ్ టెక్నాలజీ ప్రాముఖ్యతను వివరిస్తూ, భవిష్యత్తులో రక్షణ, భద్రత, ఆరోగ్యం, కమ్యూనికేషన్ వంటి రంగాల్లో ఇది విప్లవాత్మక మార్పులు తేనుందని జితేంద్ర సింగ్ అన్నారు. "సాధారణ కంప్యూటర్లతో పోలిస్తే క్వాంటమ్ కంప్యూటర్లు అత్యంత వేగవంతమైనవి. క్వాంటమ్ ఎన్‌క్రిప్షన్‌ను ఛేదించడం దాదాపు అసాధ్యం. దీనివల్ల మన దేశ భద్రత మరింత పటిష్టమవుతుంది. ఆరోగ్య రంగంలో, క్యాన్సర్ వంటి వ్యాధులకు రేడియేషన్ చికిత్స అందించేటప్పుడు, క్వాంటమ్ టెక్నాలజీతో కచ్చితంగా కణితి ఉన్న చోటే ప్రభావం చూపి, దుష్ప్రభావాలను నివారించవచ్చు" అని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వివరించారు.

ప్రధాని మోదీ దార్శనికతతో భారత్ నేడు జాతీయ క్వాంటమ్ మిషన్ ప్రారంభించిందని, అమెరికా, చైనా వంటి అతికొద్ది దేశాల సరసన నిలిచిందని మంత్రి గుర్తుచేశారు. ఈ మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 6,000 కోట్లు కేటాయించిందని తెలిపారు. "రాబోయే ఎనిమిదేళ్లలో 1,000 ఫిజికల్ క్యూబిట్‌ల సామర్థ్యం గల క్వాంటమ్ కంప్యూటర్లను అభివృద్ధి చేయడం, 2,000 కిలోమీటర్ల పరిధిలో సురక్షిత క్వాంటమ్ కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేయడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. ఈ ప్రయాణంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు భాగస్వాములు కావాలి" అని పిలుపునిచ్చారు.

అమరావతి ప్రాజెక్ట్ కోసం ముఖ్యమంత్రి రూపొందించిన రోడ్‌మ్యాప్‌ను చూసి తాను ఎంతో సంతోషించానని జితేంద్ర సింగ్ అన్నారు. చంద్రబాబు ప్రోత్సాహంతో ఆంధ్రప్రదేశ్‌లో క్వాంటమ్ టెక్నాలజీలో బీటెక్, ఎంటెక్ వంటి కోర్సులను కూడా ప్రారంభించవచ్చని సూచించారు. 

"పవిత్ర అమరావతి నగరం నుంచే నేడు భారతదేశ క్వాంటమ్ ప్రస్థానం ప్రారంభమవుతోంది. 'వికసిత్ భారత్' లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందన్న నమ్మకం నాకుంది" అని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, పలువురు శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Quantum Valley
Jitendra Singh
Amaravati
Quantum Technology
Narendra Modi
Double Engine Government
AP Development
Hi-Tech City

More Telugu News