60 సీట్లున్న బస్సులో 100 మంది ఎక్కితే గొడవలు కావా?: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్న జగ్గారెడ్డి
  • ఉచిత బస్సు పథకంపై ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం
  • ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ప్రభుత్వం హామీలను నెరవేరుస్తోందని వ్యాఖ్య
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అయితే ఉచిత బస్సు పథకంతో మహిళలు ఘర్షణలకు దిగుతున్నారంటూ ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. 60 సీట్లు ఉన్న బస్సులో 100 మంది ఎక్కితే గొడవలు కావా అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేయడం సరికాదని అన్నారు.

బియ్యం తక్కువ ఉన్నా తినేవాళ్లు ఎక్కువగా ఉన్న చందంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ తమ ప్రభుత్వం క్రమంగా అన్ని హామీలను నెరవేరుస్తోందని అన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు.

ఒక్కో వార్డుకు రూ.8 కోట్లు మంజూరు చేయిస్తానని జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే రూ.300 కోట్లు తీసుకువస్తానని అన్నారు. 2013లో 5,500 మందికి ఇంటి స్థలాలు ఇచ్చానని గుర్తు చేశారు. గత పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉందని, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటి స్థలాలు ఇప్పిస్తానని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్య ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందని ప్రకటించారు. తాను కాంగ్రెస్ పార్టీ కోసం తెలంగాణ మొత్తం తిరుగుతానని అన్నారు.


More Telugu News