నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..!

  • షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందన్న డీసీపీ శిల్పవల్లి
  • ఏయే ఫైళ్లు కాలిపోయాయనే దానిపై స్పష్టత రావాలన్న డీసీపీ
  • మంటలను తొలుత ఆఫీస్ బోయ్ గమనించాడని వెల్లడి
హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంపై సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి స్పందిస్తూ... ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు. ఉదయం 10 గంటలకు అగ్నిప్రమాదంపై సమాచారం అందిందని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని వెల్లడించారు. 

భవనం తొలి అంతస్తులో కంప్యూటర్లు ఉంటాయని డీసీపీ తెలిపారు. మంటల్లో ఏయే ఫైళ్లు కాలిపోయాయనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. మంటలను ఆఫీస్ బోయ్ తొలుత గమనించాడని... వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం కూడా చేశాడని తెలిపారు. ఈ క్రమంలో అతడు అస్వస్థతకు గురయ్యాడని... వెంటనే 108లో ఆసుపత్రికి తరలించడం జరిగిందని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు ఉద్యోగులు లోపల ఉన్నారని... మంటలను గమనించిన వెంటనే వారు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు.  

డీఎఫ్ఓ శ్రీదాస్ మాట్లాడుతూ... మొదటి అంతస్తులో పలు కేసులకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీ విభాగంలో అగ్నిప్రమాదం సంభవించిందని చెప్పారు. విలువైన హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు మంటల్లో కాలిపోయాయని వెల్లడించారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నామని... అప్పటికే మంటలు వ్యాపించాయని తెలిపారు. రెండో అంతస్తులో కెమికల్ ల్యాబ్ ఉందని... అయితే, మంటలు రెండో అంతస్తుకు వ్యాపించలేదని చెప్పారు. తొలి అంతస్తులో ఉన్న సున్నితమైన ప్లాస్టిక్ వస్తువులు ఆహుతయ్యాయని తెలిపారు. హార్డ్ డిస్కులు పూర్తిగా కాలిపోయాయా? లేదా పాక్షికంగా కాలాయా? అనేది పరిశీలించాల్సి ఉందని చెప్పారు.


More Telugu News