సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్

  • బురద రోడ్డుపై విద్యార్థుల ఆవేదన.. సోషల్ మీడియాలో వీడియో
  • వీడియో చూసి చలించిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
  • గజ్జలవారిపల్లికి రూ.86 లక్షలతో తక్షణమే రోడ్డు మంజూరు
  • కూటమి ప్రభుత్వంలో ఉదయగిరిలో రూ.55 కోట్ల రోడ్ల పనులు
  • ఈ రోడ్డు మంజూరుతో విద్యార్థులు, రైతుల కష్టాలకు తెర
"పవన్ సర్.. రోజూ బురదలో నడుస్తూ స్కూలుకు వెళ్లలేకపోతున్నాం. దయచేసి మా ఊరికి రోడ్డు వేయండి" అంటూ విద్యార్థులు చేసిన విన్నపం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కదిలించింది. సామాజిక మాధ్యమాల్లోని ఒక వీడియోలో విద్యార్థులు పడుతున్న వేదనను చూసి చలించిపోయిన ఆయన, తక్షణమే స్పందించి గంటల వ్యవధిలోనే రోడ్డు నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామ విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు సరైన రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే ఆ దారి బురదమయంగా మారి నరకాన్ని తలపిస్తోంది. తమ గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో, వారు తమ కష్టాలను వివరిస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శుక్రవారం ఈ వీడియో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చింది. విద్యార్థుల ఆవేదనను చూసిన ఆయన వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలను వెంటనే రూపొందించి, పనులు ప్రారంభించాలని ఆదేశించారు.

పవన్ కల్యాణ్ ఆదేశాలతో అధికారులు వెంటనే స్పందించి 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 86 లక్షలతో అంచనాలు సిద్ధం చేసి, పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లి విద్యార్థులకే కాకుండా, పొలాలకు వెళ్లే రైతులకు కూడా ఏళ్లనాటి కష్టాలు తీరనున్నాయి.

ఇదిలా ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉదయగిరి నియోజకవర్గంలో ఇప్పటికే 'పల్లెపండగ 1.0, 2.0', సాస్కీ నిధులతో కలిపి సుమారు రూ. 55 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టుల కింద మొత్తం 641 రోడ్ల నిర్మాణం జరుగుతోంది. వీటికి అదనంగా, తాజాగా విద్యార్థుల అభ్యర్థన మేరకు గజ్జలవారిపల్లి రోడ్డును ప్రత్యేకంగా మంజూరు చేయడం గమనార్హం.




More Telugu News