Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్

Narendra Modi receives grand welcome in Malaysia
  • రెండ్రోజుల పర్యటన నిమిత్తం మలేషియాకు చేరుకున్న ప్రధాని మోదీ
  • విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం
  • రక్షణ, భద్రత, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యం
  • ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై దృష్టి
  • భారతీయ సమాజంతో పాటు వ్యాపారవేత్తలతో మోదీ సమావేశం
భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు మలేషియాకు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కౌలాలంపూర్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్వయంగా సాదర స్వాగతం పలికారు. ఇరు దేశాల జెండాలు చేతబూనిన చిన్నారులు ప్రధాని మోదీకి అభివాదం చేశారు. అనంతరం, ఎయిర్ పోర్టు నుంచి మోదీ, అన్వర్ ఇబ్రహీం ఒకే కారులో కౌలాలంపూర్ లోని ఓ కమ్యూనిటీ ప్రోగ్రామ్ కు కలిసి వెళ్లారు.

 భారత్-మలేషియా మధ్య ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని’ మరింత పటిష్టం చేయడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం.

ఈ పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రక్షణ, భద్రత, ఆర్థిక, ఆవిష్కరణల రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. "భారత్, మలేషియా మధ్య చారిత్రక సంబంధాలు ఇటీవలి కాలంలో గణనీయమైన పురోగతి సాధించాయి. ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో చర్చల కోసం ఎదురుచూస్తున్నాను," అని ఆయన పేర్కొన్నారు. 

ఆగస్టు 2024లో ఇరు దేశాల సంబంధాలు ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి చేరిన తర్వాత మోదీ మలేషియాలో పర్యటించడం ఇదే తొలిసారి.

మలేషియాలో దాదాపు 30 లక్షల మంది ప్రవాస భారతీయులు ఉన్నారని, వారు ఇరు దేశాల మధ్య ‘సజీవ వారధి’గా నిలుస్తున్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు. తన పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే, ప్రవాస భారతీయులతో పాటు పారిశ్రామిక, వాణిజ్య ప్రతినిధులతోనూ సమావేశమవుతారు. ఈ పర్యటనకు అనుబంధంగా 10వ ఇండియా-మలేషియా సీఈవో ఫోరమ్ కూడా జరగనుంది.
Narendra Modi
Malaysia
Anwar Ibrahim
India Malaysia relations
Kuala Lumpur
Strategic partnership
Indian diaspora
Defense cooperation
Economic relations
Bilateral talks

More Telugu News