హైదరాబాద్‌లో దోమలపై రాజమౌళి తనయుడి సెటైర్.. వైరల్ అయిన వీడియో!

  • హైదరాబాద్‌లో దోమల బెడ‌ద‌పై ఎస్‌ఎస్ కార్తికేయ వీడియో
  • రాత్రిపూట షూటింగ్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న దోమలు
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సెటైరికల్ వీడియో
  • రాజమౌళి గ్రాఫిక్స్ అంటూ నెటిజన్ల వ్యంగ్య స్పందన
హైదరాబాద్ నగరంలో దోమల సమస్య ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తూ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్‌ రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్ కార్తికేయ పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలో దోమల బెడదపై ఆయన తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రం సంధించారు.

ప్రస్తుతం కార్తికేయ ఒక సినిమా నిర్మాణ పనుల్లో భాగంగా రాత్రిపూట షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో షూటింగ్ ప్రదేశంలో దోమలు విపరీతంగా ఉండటంతో యూనిట్ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లైట్ల వెలుతురులో గుంపులు గుంపులుగా తిరుగుతున్న దోమల సమూహాన్ని ఆయన వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘హైదరాబాద్‌లో దోమలు మామూలుగా లేవు, షూటింగ్ చేయడం కూడా కష్టంగా ఉంది’ అనే అర్థం వచ్చేలా ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. "రాజమౌళి సినిమాలోని గ్రాఫిక్స్‌లా ఉన్నాయి ఈ దోమలు" అంటూ కొందరు సెటైర్లు వేస్తుండగా, మరికొందరు హైదరాబాద్ మున్సిపల్ అధికారులను, ప్రభుత్వాన్ని ట్యాగ్ చేస్తూ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. 


More Telugu News