నన్ను బెదిరిస్తున్నారు.. నాకు ప్రాణహాని ఉంది: బంజారాహిల్స్ పీఎస్ లో కేకే కుమారుడి ఫిర్యాదు

  • కేకే కుమారుడు వెంకట్ కు బెదరింపులు
  • బంజారాహిల్స్ లో 11 వందల గజాల స్థల వివాదం
  • రూ. 3 కోట్లు ఇవ్వాలని బెదిరిస్తున్నారని వెంకట్ ఫిర్యాదు
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు కుమారుడు వెంకట్ కు బెదిరింపులు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. వివరాల్లోకి వెళితే, బంజారాహిల్స్ లోని 11 వందల గజాల స్థలానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు హైకోర్టులో పిల్ వేశారు. ఆ ఇద్దరు వ్యక్తులు తనను బెదిరిస్తున్నారని బంజారా హిల్స్ పీఎస్ లో వెంకట్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 

ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలంటే తమకు రూ. 3 కోట్లు ఇవ్వాలని బెదిరించినట్టు వెంకట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు ఆయన తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తనను తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో, ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News