టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కు పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం!

  • వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం
  • మోకాలి గాయంతో టోర్నీ మొత్తానికి దూరమైన మ‌రో పేస‌ర్‌ హర్షిత్ రాణా
  • అత‌ని స్థానంలో జట్టులోకి వచ్చిన మహ్మద్ సిరాజ్
  • సుందర్ ఫిట్‌నెస్‌పైనా కొనసాగుతున్న సందిగ్ధత
ఐసీసీ టీ20 ప్రపంచకప్ టైటిల్ వేటను ప్రారంభించడానికి సిద్ధమవుతున్న భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్ సమస్యలు జట్టును వేధిస్తున్నాయి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ అమెరికాతో జరగనున్న తొలి మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులో ఉండే అవకాశం కనిపించడం లేదు. అటు యువ పేసర్ హర్షిత్ రాణా మోకాలి గాయంతో టోర్నీ మొత్తానికీ దూరమయ్యాడు. 

ఈ నెల 4న దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో హర్షిత్ రాణా గాయపడ్డాడు. కేవలం ఒకే ఓవర్ బౌలింగ్ చేసిన అతడు మోకాలి నొప్పితో మైదానాన్ని వీడాడు. రాణా గాయంపై స్కాన్‌లు, నిపుణుల సంప్రదింపుల అనంతరం టోర్నీలో పాల్గొనడం సాధ్యం కాదని బీసీసీఐ వైద్య బృందం నిర్ధారించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా నిన్న‌ రాత్రి అధికారికంగా ప్రకటించారు. రాణా స్థానంలో మహ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపారు.

మరోవైపు భారత పేస్ దళానికి నాయకత్వం వహిస్తున్న జస్ప్రీత్ బుమ్రా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. నిన్న‌ వాంఖడే స్టేడియంలో జరిగిన జట్టు శిక్షణా శిబిరానికి హాజరైనప్పటికీ, అతను ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. దీంతో తొలి మ్యాచ్‌లో బుమ్రా ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. అతని స్థానంలో మహ్మద్ సిరాజ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి.

ఇదిలా ఉంటే... ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఇంకా జట్టుతో కలవలేదు. ఫిట్‌నెస్ క్లియరెన్స్ కోసం అతడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనే ఉన్నాడు. ఈ పరిణామాలతో తొలి మ్యాచ్ నాటికి భారత్ వద్ద కేవలం 13 మంది పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్న ఆటగాళ్లు మాత్రమే అందుబాటులో ఉండటం గమనార్హం. మూడోసారి టీ20 ప్రపంచకప్ గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్న భారత్‌కు ఈ అనూహ్య పరిణామాలు ఆరంభంలోనే సవాలుగా మారాయి.


More Telugu News