ఐబొమ్మ రవికి బెయిల్ ఇస్తే విదేశాలకు పారిపోతాడు: హైకోర్టులో పీపీ వాదనలు

  • బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో రవి పిటిషన్
  • విచారణ పూర్తయినందున బెయిల్ ఇవ్వాలన్న రవి
  • రవి పాస్ పోర్టు సీజ్ చేశారని, విదేశాలకు పారిపోలేడన్న రవి తరఫు న్యాయవాది
ఐబొమ్మ నిర్వాహకుడు రవికి కరేబియన్ దీవుల పౌరసత్వం ఉందని, అతడికి బెయిల్ ఇస్తే అక్కడకు వెళ్లిపోయే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావు కోర్టుకు తెలిపారు. తనకు బెయిల్ ఇవ్వాలని రవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, శుక్రవారం విచారణ జరిపారు.

మూడు నెలల నుంచి రవి జైల్లోనే ఉన్నాడని, ఇప్పటికే విచారణ కూడా పూర్తయిందని రవి తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. రవి విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాడని, బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

రవికి బెయిల్ మంజూరు చేయవద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) వాదనలు వినిపించారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌కు సంబంధించి సినిమా పరిశ్రమ నుంచి ఇప్పటికీ ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని, పోలీసులు వాటిపై దర్యాప్తు చేయాల్సి ఉందని పీపీ కోర్టుకు తెలిపారు.

అయితే రవి పాస్‌పోర్టును ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారని, ఈ తరుణంలో అతడు విదేశాలకు పారిపోయే అవకాశం లేదని రవి తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. రవి పాస్ పోర్టును సీజ్ చేశారో లేదో తెలియజేయాలంటూ పీపీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.


More Telugu News