ఇరాన్‌లో భారతీయులు 'చిక్కుకున్నారా?': స్పందించిన జైశంకర్

  • ఇరాన్ గగనతలం తెరిచే ఉందని, ఇరుదేశాల మధ్య విమానాలు నడుస్తున్నాయని వెల్లడి
  • అందుకే ఇరాన్‌లోని భారతీయులను చిక్కుకుపోయిన వారిగా పరిగణించడం లేదన్న జైశంకర్
  • భారత విద్యార్థులకు ఎప్పటికప్పుడు అడ్వైజరీ జారీ చేస్తున్నట్లు వెల్లడి
ఇరాన్‌లోని భారతీయుల విషయమై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పార్లమెంట్ వేదికగా స్పందించారు. ఇరాన్‌లో పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. అక్కడి భారత విద్యార్థులకు నిత్యం అడ్వైజరీ జారీ చేస్తున్నట్లు చెప్పారు. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం వారితో నిత్యం టచ్‌లోనే ఉంటోందని వెల్లడించారు.

అవసరమైన సమయాల్లో సలహాలు ఇవ్వడంతో పాటు తగిన సాయం అందిస్తోందని అన్నారు. ఇరాన్ గగనతలం తెరిచే ఉందని, ఇరుదేశాల మధ్య విమాన సర్వీసులు నడుస్తున్నాయని, కాబట్టి అక్కడి భారతీయులను ఇరాన్‌లో చిక్కుకుపోయిన వారిగా పరిగణించడం లేదని అన్నారు. ఆ కారణంగానే ప్రత్యేకంగా తరలింపు ప్రక్రియ చేపట్టలేదని స్పష్టం చేశారు.

ఇరాన్‌లోని 16 రాష్ట్రాల్లో ప్రస్తుతం 9 వేల నుంచి 10 వేల మంది భారతీయులు ఉన్నారని జైశంకర్ వెల్లడించారు. ఇందులో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారని తెలిపారు. కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు, నావికులు కూడా ఉన్నట్లు తెలిపారు. స్వదేశానికి రావాలనుకునే భారతీయులకు విమానాలు అందుబాటులోనే ఉన్నాయని స్పష్టం చేశారు.


More Telugu News