ఇస్లామాబాద్‌లో ఎమర్జెన్సీ... 69కి చేరిన ఆత్మాహుతి దాడి మృతుల సంఖ్య

  • మృతుల సంఖ్య 69కి చేరగా, 169 మందికి గాయాలు
  • నగరంలో ఎమర్జెన్సీని ప్రకటించినట్లు పోలీసు అధికారి వెల్లడి
  • గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు
ఆత్మాహుతి దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ ప్రభుత్వం ఇస్లామాబాద్‌లో ఎమర్జెన్సీ విధించింది. ఇస్లామాబాద్‌లోని షియా మసీదును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో మృతుల సంఖ్య 69కి చేరగా, 169 మంది గాయపడ్డారు. నగరంలోని షెహ్జాద్ టౌన్ ప్రాంతంలో గల షియా మసీదు ప్రధాన ద్వారం వద్ద పేలుడు సంభవించింది. ఈ పేలుడు వల్ల సమీపంలోని భవనాలు, కిటికీలు కూడా పగిలిపోయాయి.

పేలుడు అనంతరం నగరంలో నగరవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించినట్లు ఇస్లామాబాద్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు. ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సెస్, పాలీక్లినిక్ ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇస్లామాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఖండించారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని, పలువురు మృతి చెందారని అన్నారు. ఆత్మాహుతి దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.


More Telugu News