93 ఏళ్ల మహిళా సామాజిక కార్యకర్తపై వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర ట్వీట్

  • పద్మశ్రీ పురస్కార గ్రహీత రాధా బహన్ భట్‌ను కొనియాడిన వీవీఎస్ లక్ష్మణ్
  • 75 ఏళ్లుగా ఆమె చేస్తున్న నిస్వార్థ సేవకు సెల్యూట్ అంటూ పోస్ట్
  • మహిళలు, బాలికల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేశారని ప్రశంస
  • నిజమైన సేవకు వయసుతో పనిలేదని లక్ష్మణ్ వ్యాఖ్య
భారత మాజీ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్.. 93 ఏళ్ల సామాజిక కార్యకర్త రాధా బహిన్ భట్ సేవను కొనియాడుతూ ఓ భావోద్వేగ పోస్ట్ చేశాడు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన ఆమె జీవిత కథ తనను ఎంతగానో కదిలించిందని లక్ష్మణ్ పేర్కొన్నాడు. 75 ఏళ్లుగా ఆమె చేస్తున్న నిస్వార్థ సేవకు సెల్యూట్ చేశాడు.

ఉత్తరాఖండ్‌కు చెందిన రాధా బహిన్ భట్.. తన 18వ ఏటనే ఇల్లు వదిలి సామాజిక సేవకు జీవితాన్ని అంకితం చేశారని లక్ష్మణ్ తెలిపాడు. ఉత్తరాఖండ్‌లోని మారుమూల ప్రాంతాల్లో బాలికలు, మహిళల అభ్యున్నతి కోసం ఆమె అవిశ్రాంతంగా కృషి చేశారన్నాడు. 1957 నాటి భూదాన్ ఉద్యమం నుంచి నేటి గాంధేయవాద సంస్థల వరకు ఆమె ప్రస్థానం సాగిందని గుర్తుచేశాడు.

బాలికల విద్య, అటవీ సంరక్షణ, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి ఎన్నో కీలక అంశాలపై ఆమె పోరాటం చేశారని లక్ష్మణ్ వివరించాడు. 93 ఏళ్ల వయసులోనూ ఆమె స్ఫూర్తి ఏమాత్రం తగ్గలేదని ప్రశంసించాడు. "నిజమైన సేవకు వయసు, హద్దులతో పనిలేదు. ఉన్నతమైన లక్ష్యం పట్ల అచంచలమైన నిబద్ధత మాత్రమే ఉంటుంది. ఆమె జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం" అని లక్ష్మణ్ తన పోస్టులో పేర్కొన్నాడు. రాధా బహిన్ భట్ కథ ఎందరికో ఆదర్శమని కొనియాడాడు.


More Telugu News