KTR: రేవంత్ 'తిట్ల ట్రాప్'లో పడొద్దు.. అసలు సమస్యలపై పోరాడండి: కేటీఆర్

KTR urges BRS not to fall into Revanths trap
  • వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే  రేవంత్ తిట్ల పురాణం అంటూ కేటీఆర్ ఫైర్
  • రేవంత్ రెడ్డి 'తిట్ల ట్రాప్'లో బీఆర్ఎస్ శ్రేణులు చిక్కుకోవద్దని హితవు
  • ఆరు గ్యారెంటీలు, రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపు
  • మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యలనే ప్రధాన అజెండాగా మార్చాలని సూచన
  • తెలంగాణ నీటి వాటాలను రేవంత్ పక్క రాష్ట్రాలకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, ఆయన పన్నుతున్న ‘తిట్ల ట్రాప్’లో పార్టీ శ్రేణులు చిక్కుకోవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రజల అసలు సమస్యల నుంచి చర్చను పక్కదోవ పట్టించేందుకే రేవంత్ రెడ్డి దూషణల పర్వాన్ని ఎంచుకున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు ఆయన ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు, సంక్షేమ పథకాల అమలు వంటి మౌలిక వసతులపై చర్చ జరగాల్సి ఉండగా, సీఎం రేవంత్ తన ‘బూతు పురాణం’తో చర్చను నీరుగారుస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్‌పై చేస్తున్న దాడిని తెలంగాణ పోరాట చరిత్రపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. "పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసి, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన శిల్పి కేసీఆర్. ఆయన ఏనాడూ బిరుదుల కోసం పాకులాడలేదు. ప్రజల సంక్షేమమే ఆయనకు అసలైన సత్కారం" అని కేటీఆర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ అన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని, ఈ నమ్మకద్రోహంపైనే మన పోరాటం ఉండాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. "ఎరువుల కోసం క్యూలైన్లలో నిలబడిన రైతుల కష్టాలు, రైతు భరోసా అందక వడ్డీ వ్యాపారుల చేతిలో నలిగిపోతున్న అన్నదాతల ఆవేదనపై ప్రభుత్వాన్ని నిలదీయండి. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు, గురుకులాల్లో విషాహారంతో చిన్నారులు పడుతున్న బాధలకు బాధ్యులెవరని గల్లా పట్టి అడగండి" అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

డీఏలు, పీఆర్సీ ఊసే లేక ఉద్యోగులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక వృద్ధులు పడుతున్న మనోవేదనకు బీఆర్ఎస్ గొంతుకగా నిలవాలని ఆయన సూచించారు. సింగరేణి బొగ్గు స్కామ్, విద్యుత్ కుంభకోణాల వెనుక ఉన్న అసలు దొంగలెవరో ప్రజలకు వివరించాలని కోరారు. తెలంగాణ నీటి వాటాను పక్క రాష్ట్రాలకు ధారాదత్తం చేస్తూ రేవంత్ రెడ్డి ఒక ‘కోవర్టు’లా వ్యవహరిస్తూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనపై మున్సిపల్ ఎన్నికల్లో ప్రశ్నలను పిడుగుల్లా కురిపించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కేటీఆర్ తన లేఖలో కోరారు. ఇది తెలంగాణకు పట్టిన గ్రహణ కాలమని, ఈ చీకటిని తరిమికొట్టే బాధ్యత మనందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.
KTR
Revanth Reddy
BRS
Telangana
Municipal Elections
KCR
Congress Government
Farmers issues
Fee Reimbursement
Corruption

More Telugu News