నేపాల్‌లో విషాదం: పెళ్లి బృందం బస్సు లోయలో పడి ఎనిమిది మంది మృతి

  • ప్రమాద సమయంలో బస్సులో 60 మంది 
  • మరో 16 మంది పరిస్థితి విషమం
  • మరో వాహనంలో రావడంతో  వధూవరులు క్షేమం
  • పెళ్లి వేడుక ముగించుకుని వస్తుండగా ఘటన
వధూవరుల నూతన జీవితం ప్రారంభం కావాల్సిన వేళ, ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాల్లో తీరని చీకట్లు నింపింది. నేపాల్‌లోని బైతాడి జిల్లాలో గురువారం రాత్రి జరిగిన బస్సు ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి వేడుక ముగించుకుని తిరిగి వస్తుండగా, బైతాడి జిల్లాలోని పుర్చౌడి మున్సిపాలిటీ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

సుమారు 60 మందితో వెళ్తున్న ఈ బస్సు కొండ ప్రాంతంలోని వంకర మార్గంలో ప్రయాణిస్తూ నియంత్రణ కోల్పోయి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 45 మందికి పైగా గాయపడగా, వారిలో 16 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరందరినీ సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అయితే, వధూవరులు వేరే వాహనంలో ప్రయాణిస్తుండటంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే నేపాల్ సైన్యం, పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టి క్షతగాత్రులను బయటకు తీశారు.

నేపాల్‌లో ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. పదేళ్ల క్రితం ఏడాదికి సుమారు 5 వేల ప్రమాదాలు నమోదవ్వగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 7,669కి చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కేవలం గడిచిన ఏడాదిలోనే 190 మంది ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం.. నేపాల్‌లో జరుగుతున్న ఈ రోడ్డు ప్రమాదాల వల్ల దేశ స్థూల జాతీయోత్పత్తిలో 1.5 శాతం నష్టం వాటిల్లుతోంది. మృతుల్లో 70 శాతం మంది పాదచారులు, ద్విచక్ర వాహనదారులే ఉండటం గమనార్హం. రోడ్ల అనుసంధానత పెరుగుతున్నా, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, డ్రైవర్ల అజాగ్రత్తే ఈ మరణాలకు ప్రధాన కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు. 


More Telugu News