సిక్కుల పట్ల కాంగ్రెస్ అగ్రనేతకు ఎంత ద్వేషం ఉందో ఆ మాటల్లో కనిపించింది: ప్రధాని మోదీ

  • కాంగ్రెస్ పార్టీని ఎంతోమంది వీడారు కానీ బిట్టును మాత్రం అవమానించారన్న మోదీ
  • ఇదేనా మీరు తెరిచిన మొహబ్బత్ కీ దుకాణం అని చురక
  • గరీబీ హఠావో కాంగ్రెస్ పార్టీకి ఒక నినాదం మాత్రమేనని వ్యాఖ్య
సిక్కుల పట్ల కాంగ్రెస్ అగ్రనేతకు (రాహుల్ గాంధీకి) ఎంత ద్వేషం ఉందో ఆయన మాటల్లోనే కనిపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎంతోమంది వీడారని, కానీ ఆ పార్టీ ముఖ్య నేత మాత్రం రవ్‌నీత్ బిట్టును పార్లమెంట్ ఆవరణలో అవమానించారని మండిపడ్డారు.

సిక్కుల పట్ల ఆయనకు ఉన్న ద్వేషం ఈ మాటల్లో కనిపించిందని వ్యాఖ్యానించారు. ఇదేనా మీరు తెరిచిన మొహబ్బత్ కీ దుకాణం అని ప్రశ్నించారు. ఇదే చోట ఓ ఎంపీని కాంగ్రెస్ అగ్రనేత ద్రోహి అనడం దారుణమని అన్నారు. అతనికి గర్వం తలకెక్కిందని అన్నారు. ఆ పార్టీకి దూరదృష్టి, ఎటువంటి ప్రణాళిక లేదని విమర్శించారు. కాగా, నిన్న బిట్టూ, రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం సాగిన విషయం తెలిసిందే.

ప్రధాని మోదీ ఇంకా మాట్లాడుతూ, గరీబీ హఠావో కాంగ్రెస్ పార్టీకి ఒక నినాదం మాత్రమే అని అన్నారు. ప్రతి విషయంలో విపక్షాలు తనను నిందిస్తున్నాయని మండిపడ్డారు. నక్సలిజాన్ని అంతం చేసినందుకు తనను నిందిస్తున్నారా అని ప్రశ్నించారు. మా ప్రభుత్వంపై పేదలకు నమ్మకం పెరిగిందని అన్నారు.


More Telugu News