ఇళయరాజా పట్టువదలని వ్యక్తి: తమన్

దక్షిణ భారత అగ్రశ్రేణి సంగీత దర్శకుల్లో ఒకరైన ఎస్.ఎస్. తమన్, భారత సంగీత దిగ్గజం ‘ఇసైజ్ఞాని’ ఇళయరాజాపై ప్రశంసల వర్షం కురిపించారు. 77 ఏళ్ల వయసులో సొంతంగా రికార్డింగ్ స్టూడియోను ఏర్పాటు చేసిన ఇళయరాజాను చూసి స్ఫూర్తి పొందానని తెలిపారు. ఆయనను "నిజమైన సంగీత దిగ్గజం" అని, "ఎన్నడూ పట్టువదలని మనిషి" అని అభివర్ణించారు.

ఇటీవల ఇళయరాజా తన కొత్త మ్యూజిక్ స్టూడియో ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. "ఫిబ్రవరి 3 నాటికి ఈ కొత్త స్టూడియోలోకి వచ్చి ఐదేళ్లు పూర్తయ్యాయి. నా రెండో సింఫనీ రచన కూడా దాదాపు పూర్తయింది" అని ఆయన పేర్కొన్నారు.

ఈ పోస్ట్‌ను ఉటంకిస్తూ తమన్ స్పందించారు. "77 ఏళ్ల వయసులో సొంత రికార్డింగ్ స్టూడియో కట్టారు. ఆయనే నిజమైన లెజెండ్. పట్టువదలని మనిషి. కుర్రాళ్లూ.. మనం ఇప్పుడే మొదలుపెట్టాం. ఒకటే జీవితం, బతుకుదాం. మాస్టర్ ఇళయరాజా గారి నుంచి నేర్చుకుందాం" అని రాసుకొచ్చారు.

గతేడాది మార్చి 8న లండన్‌లోని ఈవెంటిమ్ అపోలో థియేటర్‌లో ఇళయరాజా తన మొదటి పాశ్చాత్య క్లాసికల్ సింఫనీ 'వ్యాలియంట్'ను ప్రదర్శించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ప్రపంచ ప్రఖ్యాత రాయల్ ఫిల్హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రాతో కలిసి ఆయన ఈ ప్రదర్శన ఇచ్చారు. గతేడాది అక్టోబర్‌లో తన తల్లి వర్ధంతి తర్వాత రెండో సింఫనీ రాయడం ప్రారంభిస్తానని ఇళయరాజా ప్రకటించారు. దీంతో పాటు 'సింఫోనిక్ డ్యాన్సర్స్' అనే మరో కొత్త సంగీత రచనను కూడా చేయనున్నట్లు తెలిపారు.



More Telugu News