వాషింగ్టన్ పోస్ట్ లో భారీగా లేఆఫ్ లు... ఉద్యోగం కోల్పోయిన శశిథరూర్ కుమారుడు
- 300 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన వాషింగ్టన్ పోస్ట్
- తాను ఉద్యోగం కోల్పోయినట్టు వెల్లడించిన ఇషాన్ థరూర్
- తనతో పాటు పలువురు ఉద్యోగాలు కోల్పోయారని వెల్లడి
అమెరికన్ మీడియా చరిత్రలో అతి పెద్ద లేఆఫ్ జరిగింది. ప్రఖ్యాత మీడియా సంస్థ వాషింగ్టన్ పోస్ట్ 300 మందికి పైగా జర్నలిస్టులు, సిబ్బందిని లేఆఫ్ చేసింది. ఇది పత్రిక ఎడిటోరియల్ వర్క్ఫోర్స్లో మూడవ వంతు కంటే ఎక్కువ. ఈ నిర్ణయం యుద్ధ ప్రాంతాలు, గ్లోబల్ రాజధానులు, సున్నితమైన డేట్లైన్ల నుంచి రిపోర్ట్ చేస్తున్న కరస్పాండెంట్లలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఈ కట్స్ ప్రధానంగా విదేశీ బ్యూరోలు, లోకల్ రిపోర్టింగ్ టీమ్స్, స్పోర్ట్స్ డెస్క్, బిజినెస్ డివిజన్లో గణనీయ భాగాలను తాకాయి. ఇది కేవలం పత్రికకు మాత్రమే కాకుండా గ్లోబల్ జర్నలిజానికి “డార్క్ డే” అని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు.
లేఆఫ్ అయిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కుమారుడు ఇషాన్ థరూర్ (సీనియర్ ఇంటర్నేషనల్ అఫైర్స్ కాలమ్నిస్ట్) కూడా ఉన్నారు. ఇషాన్ థరూర్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. “నేను ఈ రోజు వాషింగ్టన్ పోస్ట్ నుంచి లేఆఫ్ అయ్యాను. నాతో పాటు అంతర్జాతీయ వ్యవహారాలు చూసే పలువురు ఉద్యోగాలు కోల్పోయారు. 12 ఏళ్లుగా నేను ఈ సంస్థలోనే పని చేస్తున్నాను. ఎంతో మంది అద్భుతమైన వ్యక్తులతో కలిసి పని చేశాను. ఈ పరిణామం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది” అని అన్నారు. న్యూస్ రూమ్ ను, 'డెమోక్రసీ డైస్ ఇన్ డార్క్ నెస్' అనే పోస్టర్ ను షేర్ చేశారు. 'డార్క్ డే' అనే వ్యాఖ్యను జోడించారు. ఈ పోస్ట్ ను శశిథరూర్ కూడా రీషేర్ చేశారు.