హిందీ మాట్లాడేవాళ్లు పానీ పూరీ అమ్ముకునేందుకు తమిళనాడుకు వస్తారు: తమిళనాడు మంత్రి సంచలన వ్యాఖ్యలు
- మరోసారి భాషా వివాదాన్ని రేపిన మంత్రి ఎంఆర్కే పన్నీర్ సెల్వం
- కేవలం హిందీ మాట్లాడేవారికి పని అవకాశాలు తక్కువగా ఉంటాయని వ్యాఖ్య
- వివాదానికి తెరదించే ప్రయత్నం చేసిన డీఎంకే ప్రభుత్వం
రెండు భాషలు వర్సెస్ మూడు భాషల వివాదాన్ని తమిళనాడు మంత్రి ఎంఆర్కే పన్నీర్ సెల్వం మళ్లీ రేపారు. ఉత్తర భారత రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఉత్తరాది వారు కేవలం హిందీ మాత్రమే నేర్చుకుని వస్తారని... దీంతో, వారికి తమిళనాడులో పని అవకాశాలు తక్కువగా ఉండటంతో టేబుల్స్ శుభ్రం చేయడం, కూలి పనులు, పానీ పూరీ అమ్మడం వంటి సాధారణ ఉద్యోగాలు చేస్తున్నారని విమర్శించారు. “కానీ మా పిల్లలు రెండు భాషల విధానం (తమిళం + ఇంగ్లీష్) వల్ల బాగా ఇంగ్లీష్ నేర్చుకుని అమెరికా, లండన్లో కోట్లు సంపాదిస్తున్నారు” అని ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో... అధికార డీఎంకే పార్టీ వెంటనే స్పందించి, వివాదానికి తెరదించే ప్రయత్నం చేసింది. డీఎంకే స్పోక్స్ పర్సన్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ చట్టబద్ధమైన ప్రతి పనికి గౌరవం ఉంటుందని అన్నారు. ఆ పనులకు తాము వ్యతిరేకం కాదని చెప్పారు. కేంద్రం చెబుతున్న మూడు భాషల విధానం వల్ల ఉపయోగం లేదని... రెండు భాషల విధానం తమిళనాడుకు అభివృద్ధి, గ్లోబల్ అవకాశాలను ఇచ్చిందని తెలిపారు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఇంగ్లీష్ ప్రాధాన్యత లేకపోవడం వల్ల విద్యాభివృద్ధి జరగలేదని చెప్పారు. హిందీ మాట్లాడేవారు లేదా వారు చేసే పనులపై తమిళనాడుకు ఎలాంటి వ్యతిరేకత లేదని ఆయన స్పష్టం చేశారు.
పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజా గత నెల ఎన్డీటీవీ తమిళనాడు సదస్సులో భాష అంశంపై మరింత సూక్ష్మంగా స్పందించారు. హిందీ మాట్లాడే వారిని ఆపలేమని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న జర్మన్, జపనీస్ ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. “ఈ విదేశీయులు తమిళనాడులో సంతోషంగా ఉంటున్నారు. హిందీ మాట్లాడే స్నేహితులు ఎందుకు ఆనందంగా ఉండటం లేదు?” అని ప్రశ్నించారు.
మంత్రి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు భాష అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి. కేంద్రం 2019లో తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP)లోని మూడు భాషల విధానం ద్వారా... హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది.