అమెరికా గుండెల్లో 'ఇరాన్' రైళ్లు.. భూగర్భంలో భారీ క్షిపణి కేంద్రం సిద్ధం

  • రక్షణ నుంచి దాడుల శైలికి ఇరాన్ సైనిక సిద్ధాంతం మార్పు
  • అండర్ గ్రౌండ్ మిస్సైల్ బేస్‌ను సందర్శించిన ఇరాన్ సైనిక దళాల అధిపతి
  • శత్రువులపై విరుచుకుపడేలా క్షిపణి సామర్థ్యం పెంపు
  • అమెరికా తప్పు చేస్తే వారి స్థావరాలకు రక్షణ ఉండదని హెచ్చరిక
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్ తన సైనిక పరాక్రమాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. అమెరికాతో గరిష్ఠ స్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒక అత్యాధునిక 'అండర్ గ్రౌండ్ మిస్సైల్ బేస్'ను ఆవిష్కరించింది. ఇరాన్ సైనిక దళాల అధిపతి అబ్దోల్రహీమ్ మౌసవి బుధవారం ఈ కేంద్రాన్ని సందర్శించి, క్షిపణి యూనిట్ల సన్నద్ధతను స్వయంగా పరిశీలించారు.

ముఖ్యంగా, ఇరాన్ తన సైనిక సిద్ధాంతాన్ని రక్షణ నుంచి దాడుల శైలికి మార్చినట్లు మౌసవి ప్రకటించడం అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. గత ఏడాది ఇజ్రాయెల్‌తో జరిగిన 12 రోజుల యుద్ధం తర్వాత, కేవలం ఎదురుదాడి చేయడమే కాకుండా.. శత్రువుపై మెరుపు వేగంతో విరుచుకుపడేలా తమ క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికా గనుక ఏ చిన్న తప్పు చేసినా, ఆ ప్రాంతంలో ఉన్న అమెరికా పౌరులకు కానీ, వారి స్థావరాలకు కానీ రక్షణ ఉండదని ఘాటుగా హెచ్చరించారు.

ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తన విమాన వాహక నౌకలను మోహరించడంతో పాటు, ఇరాన్ డ్రోన్లను కూల్చివేస్తూ ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు, ఒమన్‌లో ఇరు దేశాల మధ్య రహస్య చర్చలు జరగనున్నాయన్న వార్తల నడుమ.. ఇరాన్ తన భూగర్భ క్షిపణి నగరాన్ని బయటపెట్టడం ద్వారా వాషింగ్టన్‌కు ఒక బలమైన సంకేతం పంపింది. 


More Telugu News

Iran Iran missile base Underground missile base Abdolrahim Mousavi America Persian Gulf Oman Israel Military Islamic Revolutionary Guard Corps