ట్రంప్ నిర్ణయం ఎఫెక్ట్... బెంగళూరులో గూగుల్ భారీ క్యాంపస్!

  • హెచ్1బీ వీసాల జారీకి అమెరికా కొత్త నిబంధనలు
  • టెక్ కంపెనీలకు భారంగా విదేశీ ఉద్యోగుల నియామకం
  • లక్షల చదరపు అడుగుల్లో బెంగళూరులో క్యాంపస్ ఏర్పాటుకు గూగుల్ సిద్ధం
టెక్ దిగ్గజం గూగుల్ బెంగళూరులో భారీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైందని బ్లూమ్‌‍బర్గ్ కథనం పేర్కొంది. హెచ్1బీ వీసాల జారీకి అమెరికా కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. దీంతో విదేశీ ఉద్యోగుల నియామకం టెక్ కంపెనీలకు భారంగా మారింది. దీనితో గూగుల్ కీలక చర్యలు చేపట్టింది. వీసాలు, ప్రభుత్వ అనుమతులతో సంబంధం లేకుండా, భారత్‌లో కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు సిద్ధమైంది.

బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం, దేశంలోనే అతిపెద్ద టెక్ హబ్ అయిన బెంగళూరులోని వైట్ ఫీల్డ్‌లో గూగుల్ లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో కొత్త కార్యాలయాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది. 20 వేల మంది ఉద్యోగుల కోసం ఈ క్యాంపస్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఓ ఆఫీస్ టవర్‌ను గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ లీజుకు తీసుకుందని, మరో రెండు టవర్ల కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ మూడు టవర్లు 24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు తెలుస్తోంది. తొలి టవర్ లీజును అల్ఫాబెట్ కూడా ధృవీకరించింది. మొదటి టవర్ కొన్ని నెలల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తుందని, మిగిలిన రెండు టవర్ల నిర్మాణం వచ్చే సంవత్సరం పూర్తవుతుందని పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో గూగుల్‌కు 14 వేల మంది ఉద్యోగులు ఉండగా, వైట్ ఫీల్డ్ క్యాంపస్ పూర్తిగా మొదలైతే అమెరికా వెలుపల గూగుల్ కార్యకలాపాలకు భారత్ కీలక కేంద్రంగా మారనుంది.

కాగా, ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసా ఫీజులను పెంచిన విషయం తెలిసిందే. ఒక్కో దరఖాస్తుకు 1,00,000 డాలర్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. దీనితో అనేక టెక్ కంపెనీలు అమెరికా వెలుపల తమ కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా భారత్ లాంటి దేశాల్లో గూగుల్ వంటి సంస్థలు తమ కార్యకలాపాలు విస్తరించడానికి ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం కారణమైంది.


More Telugu News

Google Google Bangalore Google India Whitefield Bangalore H1B visa Trump policy Alphabet Inc