Khemchand Singh: మణిపూర్ నూతన ముఖ్యమంత్రిగా మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు ఖేమ్‌చంద్ సింగ్

Khemchand Singh Appointed as New Manipur Chief Minister
  • ఢిల్లీలో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో కీలక నిర్ణయం
  • గతేడాది బీరేన్ సింగ్ రాజీనామాతో రాష్ట్రపతి పాలన విధింపు
  • ఫిబ్రవరి 12తో ముగియనున్న రాష్ట్రపతి పాలన
  • హింస తర్వాత గిరిజన ప్రాంతాల్లో పర్యటించిన తొలి మెయితీ నేతగా గుర్తింపు
మణిపూర్‌లో ఏడాదిగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా అసెంబ్లీ మాజీ స్పీకర్ యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు పార్టీ ప్రకటించింది.

రాష్ట్రంలో జాతుల మధ్య హింస ప్రజ్వరిల్లిన నేపథ్యంలో, అప్పటి ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో గతేడాది ఫిబ్రవరి 13 నుంచి మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. మెజారిటీ మైతీ వర్గానికి చెందిన ఖేమ్‌చంద్ సింగ్, గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సింగ్జమీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున గెలుపొందారు.

ఖేమ్‌చంద్ సింగ్ శ్రీకృష్ణుని భక్తుడు. అంతేకాకుండా, సంప్రదాయ టేక్వాండో క్రీడలో 5వ డాన్ బ్లాక్ బెల్ట్ సాధించిన తొలి భారతీయుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. హింస చెలరేగిన తర్వాత ఇటీవల గిరిజన ప్రాబల్యం ఉన్న ఉఖ్రుల్, కమ్‌జోంగ్ జిల్లాల్లో పర్యటించిన తొలి మైతీ నేతగా ఆయన నిలిచారు.

ముఖ్యమంత్రి ఎన్నిక ప్రక్రియ కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌ను కేంద్ర పరిశీలకుడిగా నియమించింది. అధిష్ఠానం ఆదేశాలతో బీజేపీ, మిత్రపక్షాల ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకుని ఈ సమావేశంలో పాల్గొన్నారు. 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉండగా, మిత్రపక్షాలైన ఎన్పీపీకి ఆరుగురు, ఎన్పీఎఫ్‌కు ఐదుగురు ఎమ్మెల్యేల బలం ఉంది.

More Telugu News

Khemchand Singh
Manipur
Manipur Chief Minister
BJP
N Biren Singh
martial arts
politics
ethnic violence
Singjamei constituency
Meitei