ఇంట్లోకి చొరబడి మరీ కొడుతుంది... ధురంధర్-2 టీజర్ వచ్చేసింది... వీడియో ఇదిగో!

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ మరోసారి తన భీకరమైన అవతారంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. 'ధురంధర్' మొదటి భాగం సృష్టించిన రికార్డుల తర్వాత, దాని సీక్వెల్ 'ధురంధర్ 2: ది రివెంజ్' టీజర్ విడుదలైంది. టీజర్ చివర్లో రణ్‌వీర్ పలికే "యే నయా హిందుస్థాన్ హై. యే ఘర్ మే ఘుసేగా భీ ఔర్ మారేగా భీ" (ఇది కొత్త హిందుస్థాన్. ఇంట్లోకి చొరబడి మరీ కొడుతుంది) అనే డైలాగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇదే డైలాగ్‌ను దర్శకుడు ఆదిత్య ధర్ తన గత బ్లాక్‌బస్టర్ 'యూరి: ది సర్జికల్ స్ట్రైక్'లో ఉపయోగించడం విశేషం.

ఒక నిమిషం 12 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో, రణ్‌వీర్ పోషిస్తున్న హమ్జా అలీ మజారీ పాత్ర యవ్వనంలోని జీవితాన్ని చూపించారు. పాకిస్థాన్‌లోని ల్యారీ టౌన్‌ను శాసించే ఓ క్రూరమైన గ్యాంగ్‌లో అతను ఎలా ఎదిగాడో, స్పైగా మారకముందు అతని నేపథ్యం ఏమిటో ఈ టీజర్ తెలియజేస్తోంది. టీజర్‌తో పాటు "అబ్ బిగడ్నే కా వక్త్ ఆ గయా హై" అనే క్యాప్షన్‌తో ఓ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

ఆదిత్య ధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. మొదటి భాగంలో చనిపోయిన అక్షయ్ ఖన్నా పాత్ర ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో కనిపించనుంది.

జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్, ఆదిత్య ధర్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

గతేడాది డిసెంబర్‌లో విడుదలైన 'ధురంధర్' మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,320 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇప్పుడు 'ధురంధర్ 2' చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 


More Telugu News