అలా చేసినప్పుడు విచారణ తప్పదు.. బీఆర్ఎస్ నేతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

  • అక్రమ మార్గాలు ఎంచుకున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ తప్పదని వ్యాఖ్య
  • నేటి నేతలకు పదవీ వ్యామోహం పోవడం లేదన్న ముఖ్యమంత్రి
  • బీఆర్ఎస్ నేతలు చేయాల్సిన తప్పులన్నీ చేశారని వ్యాఖ్య
అక్రమ మార్గాలు ఎంచుకున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ తప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలు చేయాల్సిన తప్పులన్నీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం నేరాలు చేస్తాం కానీ మమ్మల్ని ఎవరూ ప్రశ్నించవద్దనేలా వారు మాట్లాడటం విడ్డూరమని అన్నారు.

నేటి నేతలకు పదవీ వ్యామోహం పోవడం లేదని, తెలంగాణలో పదవులన్నీ కేసీఆర్ కుటుంబమే అనుభవించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. అమరవీరుల స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రావి నారాయణరెడ్డి పురస్కారాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ముఖ్యమంత్రి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నారాయణరెడ్డి స్ఫూర్తితో తాము పనిచేస్తున్నామని అన్నారు.

నిజాం పాలకులకు వ్యతిరేకంగా రావి నారాయణరెడ్డి పోరాటం చేశారని అన్నారు. నాడు ప్రజల కష్టాలు, రాచరిక పోకడలు, అరాచక చర్యలపై పోరాడారని అన్నారు. 500 ఎకరాల భూమిని పేదలకు పంచి ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. స్వేచ్ఛను హరించి, హక్కులకు భంగం కలిగిస్తే తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. ప్రజల తిరుగుబాటు సాయుధ పోరాటంగా మారుతుందని రావి నారాయణరెడ్డి చాటి చెప్పారని అన్నారు.

ప్రజల నుంచి తిరస్కారం పొందినా నేటి నేతలకు పదవీ వ్యామోహం పోవడం లేదని విమర్శించారు. తెలంగాణలో పదవులన్నీ కేసీఆర్ కుటుంబం అనుభవించిందని అన్నారు. వందల ఎకరాల ఫామ్‌హౌస్‌లు, వేల కోట్ల వ్యాపారాలు మీకెలా వచ్చాయని కేసీఆర్ కుటుంబాన్ని ప్రశ్నించారు.


More Telugu News