Soumya: గంజాయి స్మగ్లర్ల దాడిలో మృతిచెందిన కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా

Excise Constable Soumya Family Receives 1 Crore Ex Gratia
  • గంజాయి స్మగ్లర్ల దాడిలో మరణించిన కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా
  • సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం, రిటైర్మెంట్ వరకు కుటుంబానికి జీతం
  • నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
  • ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు ఇచ్చే ప్రతిపాదన పరిశీలనలో ఉందని వెల్లడి
  • పోలీసు లాంఛనాలతో సౌమ్య అంత్యక్రియలు జరపాలని ప్రభుత్వ నిర్ణయం
గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గజ్జల సౌమ్య (25) కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమె కుటుంబానికి రూ. 1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. దీంతో పాటు సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆమె పదవీ విరమణ వయసు వరకు పూర్తి జీతాన్ని కుటుంబ సభ్యులకు చెల్లించనున్నట్లు వెల్లడించింది. సౌమ్య అంత్యక్రియలను పోలీసు లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నిజామాబాద్ జిల్లా మాధవనగర్ వద్ద జనవరి 23న వాహనాల తనిఖీ చేస్తుండగా గంజాయి స్మగ్లర్లు కారుతో సౌమ్యను ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె, వారం రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. ఆదివారం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గాంధీ ఆసుపత్రికి వెళ్లి సౌమ్య భౌతికకాయానికి నివాళులర్పించారు. విధి నిర్వహణలో ఆమె చూపిన ధైర్యం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని, ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎక్సైజ్ సిబ్బంది భద్రత ప్రభుత్వ బాధ్యత అని, వారికి ఆయుధాలు అందించే ప్రతిపాదన పరిశీలనలో ఉందని తెలిపారు. సౌమ్య కుటుంబానికి ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్న ఎక్సైజ్ ఉద్యోగులను మంత్రి అభినందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పోలీసులను ఆదేశించారు.
Soumya
Excise Constable Soumya
Telangana Government
Ganja Smugglers
Nizamabad
Revanth Reddy
Ex gratia
Government Job
Jupally Krishna Rao
Telangana News

More Telugu News