హీరో శర్వానంద్ ఆసక్తికర కామెంట్స్

  • రాబోయే ‘బైకర్‌’ సినిమా కోసం రెండేళ్లలో 22 కిలోల బరువు తగ్గానన్న శర్వానంద్
  • సంక్రాంతి తనకు బాగా కలిసి వస్తోందని వెల్లడి
  • వచ్చే సంక్రాంతికి శ్రీనువైట్ల దర్శకత్వంలో మరో సినిమాతో రానున్నానన్న శర్వానంద్
  • చిరంజీవి ‘స్వయంకృషి’ సినిమా తనను నటన వైపు నడిపించిందన్న శర్వానంద్
‘ఫ్యామిలీ హీరో’గా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’తో ప్రేక్షకులను అలరించి హిట్‌ ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న ఆయన, పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాబోయే ‘బైకర్‌’ సినిమా కోసం 18 ఏళ్ల యువకుడిగా కనిపించాల్సి రావడంతో రెండేళ్లలో 22 కిలోల బరువు తగ్గానని తెలిపారు. కేబీఆర్‌ పార్క్‌లో రన్నింగ్‌, జిమ్‌, కఠిన ఆహార నియమాలతో ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. 

సంక్రాంతి తనకు బాగా కలిసి వస్తోందని, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘శతమానం భవతి’, ‘నారీ నారీ నడుమ మురారి’తో పొంగల్ హ్యాట్రిక్ సాధించిన ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే సంక్రాంతికి శ్రీనువైట్ల దర్శకత్వంలో మరో సినిమాతో రానున్నట్లు వెల్లడించారు. ‘నారీ నారీ నడుమ మురారి’ టైటిల్‌ను బాలకృష్ణ అనుమతితోనే వాడుకున్నామని, ఆయన ఆశీర్వాదం తనకు ఎంతో ప్రత్యేకమని అన్నారు. చిరంజీవే తనకు ప్రేరణ అని, ‘స్వయంకృషి’ సినిమా తనను నటన వైపు నడిపించిందని గుర్తు చేసుకున్నారు. 

‘పడిపడి లేచె మనసు’ ఫలితం తనను లోతుగా ఆలోచింపజేసిందని, ఆ క్రమంలోనే తొందరపడి సినిమాలకు ఒప్పుకోకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలన్నా జాగ్రత్తగా ఆలోచిస్తున్నానన్నారు. టైమ్‌ ట్రావెల్‌ చేసే అవకాశం వస్తే నేరుగా ఇంటర్‌ కాలేజీ రోజుల్లోకే వెళ్లిపోతానని, అవే నిజమైన హ్యాపీ డేస్‌ అని వ్యాఖ్యానించారు. నిన్నటి గురించి బాధలు, రేపటి గురించి ఆందోళనలు ఏమీ ఉండేవి కావని అన్నారు. అప్పట్లో  కాలేజీకి డుమ్మా కొట్టి సినిమాలకు వెళ్లడం, అక్కడి నుంచి దాబాకు వెళ్లి తిండి తినడం, అవన్నీ గోల్డెన్‌ మెమరీస్‌ అని చెప్పుకొచ్చారు. 


More Telugu News