ఏపీ పోలీసుల అదుపులో ఘరానా మోసగాడు

  • మ్యాట్రిమోనీ వెబ్ సైట్‌ల ద్వారా ఒంటరి, వితంతు మహిళల లక్ష్యంగా మోసం చేస్తున్న ఘరానా నేరస్తుడిని పోలీసులు పట్టుకున్న వైనం
  • నిందితుడి నేరాల చిట్టా వివరించిన రాజమహేంద్రవరం సెంట్రల్ జోన్ ఇన్‌ఛార్జి డీఎస్పీ శ్రీకాంత్ 
  • గోదావరిలో పుణ్య స్నానాల కోసం అంటూ మహిళలను పిలిపించి నగలతో ఉడాయిస్తున్న వైనం
మ్యాట్రిమోనీ వెబ్ సైట్‌ల ద్వారా ఒంటరి, వితంతు మహిళల లక్ష్యంగా మోసం చేస్తున్న ఘరానా నేరస్తుడిని తూర్పు గోదావరి  పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ జోన్ ఇన్‌ఛార్జి డీఎస్పీ శ్రీకాంత్ సదరు మోసగాడి నేరాల చిట్టాను వివరించారు. 
 
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పి.వడ్డురు గ్రామానికి చెందిన చల్లా నారాయణ (అలియాస్ నారాయణ కృష్ణ, అలియాస్ కృష్ణ నారాయణ) వివిధ పేర్లతో మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో ఖాతాలు తెరిచి వితంతు, ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకునేవాడు. తాను గోవాలో బంగారు వ్యాపారి అని చెప్పుకుంటూ వివాహ ప్రతిపాదనలు పంపి, మహిళలతో పరిచయం పెంచుకునేవాడు. ఆ తర్వాత జాతకంలో దోషాలు ఉన్నాయని, రాజమహేంద్రవరం వచ్చి గోదావరిలో పుణ్యస్నానం చేసి పూజలు చేస్తే అన్నీ సరిచూసుకుంటాయని నమ్మించేవాడు. అలాగే బంగారు నగలు ధరించి వస్తే తన తల్లిదండ్రులకు కూడా నచ్చుతారని మాయమాటలు చెప్పి మహిళలను రాజమహేంద్రవరం రప్పించేవాడు. ఇక్కడ స్నానాలు పూర్తయ్యాక పూజా సామగ్రి తెస్తానని చెప్పి, వారు తీసుకొచ్చిన నగలు, విలువైన వస్తువుల బ్యాగ్‌తో పరారయ్యేవాడు. 

గత తొమ్మిది నెలల కాలంలో రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఇతడిపై ఐదు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నం, నెల్లూరు, కడప, శ్రీకాకుళం, హైదరాబాద్‌కు చెందిన మహిళలు ఇతడి మాటలు నమ్మి మోసపోయారు. నిందితుడి నుంచి సుమారు రూ.75 లక్షల విలువైన రెండు సెల్ ఫోన్లు, 340 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు కార్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతడిపై గతంలో పలు జిల్లాల్లో పోక్సో, చీటింగ్, హత్య, రౌడీషీట్‌కు సంబంధించిన ఏడు కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


More Telugu News