ఆమిర్ ఖాన్ మా ఇంట్లో బట్టలు మార్చుకునేవాడు.. మా వంటగదిలో టీ పెట్టుకునేవాడు: నటి మమతా కులకర్ణి

  • 90ల నాటి బాలీవుడ్ వాతావరణాన్ని గుర్తు చేసుకున్న నటి మమతా కులకర్ణి
  • 'బాజీ' షూటింగ్ సమయంలో ఆమిర్ ఖాన్ తన ఇంట్లోనే బట్టలు మార్చుకునేవారని వెల్లడి
  • ప్యాకప్ తర్వాత తన వంటగదిలోకి వెళ్లి ఆమిర్ టీ కూడా చేసుకునేవారని వ్యాఖ్య
  • ఆ రోజుల్లో మతాల గురించి పట్టించుకోలేదన్న ఒకప్పటి స్టార్ హీరోయిన్
ఒకప్పటి స్టార్ హీరోయిన్ మమతా కులకర్ణి 90ల నాటి బాలీవుడ్ వాతావరణాన్ని, నటీనటుల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్‌తో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ రోజుల్లో సెట్స్‌లో వ్యానిటీ వ్యాన్లు ఉండేవి కావని, 'బాజీ' (1995) సినిమా షూటింగ్ సమయంలో ఆమిర్ ఖాన్ నేరుగా తన ఇంటికి వచ్చి బెడ్‌రూమ్‌లో బట్టలు మార్చుకునేవారని ఆమె వెల్లడించారు.

ఆనాటి పని సంస్కృతి గురించి వివరిస్తూ.. "ఆ రోజులు వేరు. ఆమిర్ ఖాన్ మా ఇంటికి వచ్చేవాడు. 'బాజీ' షూటింగ్ లోఖండ్‌వాలాలో జరుగుతుంటే, ఆయన నేరుగా మా ఇంటికి వచ్చి నా బెడ్‌రూమ్‌లో దుస్తులు మార్చుకుని షూటింగ్‌కు వెళ్లేవారు. ప్యాకప్ అయ్యాక ఇద్దరం కలిసి మా ఇంటికి వచ్చేవాళ్లం. ఆమిర్ మా వంటగదిలోకి వెళ్లి స్వయంగా టీ చేసుకుని తాగేవాడు. అప్పటి వాతావరణంలో అంతటి చనువు, ఆత్మీయత ఉండేవి" అని మమతా కులకర్ణి తెలిపారు.

బాలీవుడ్‌లో "మతతత్వం" పెరిగిపోయిందంటూ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. "నిజం చెప్పాలంటే, నేను 90లలో పనిచేసినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్‌లతో కలిసి పనిచేశాను. మేమెప్పుడూ ఒకరి మతాన్ని చూసుకోలేదు. వరల్డ్ టూర్లకు వెళ్లినప్పుడు ఒకరి ఇళ్లలో ఒకరం కూర్చుని, వంట చేసుకుంటూ, టీ తాగుతూ సరదాగా గడిపేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు" అని అన్నారు. కళాకారుడు ఎప్పటికీ కళాకారుడేనని, దయచేసి ఇక్కడికి వివక్షను తీసుకురావద్దని ఆమె కోరారు.

ఏఆర్ రెహమాన్ సంగీతం ఇప్పుడు అంతగా ఆదరణ పొందడం లేదేమోనని నా అభిప్రాయం
ఏఆర్ రెహమాన్ గురించి మాట్లాడుతూ.. "ప్రతిదానికీ ఒక సమయం ఉంటుంది. బహుశా ఆయన తరహా సంగీతానికి ఇప్పుడు అంత ఆదరణ లేకపోవచ్చు. ఈ రోజుల్లో ఎంతోమంది మంచి గాయకులు పనిలేకుండా ఇంట్లో కూర్చున్నారు" అని మమతా కులకర్ణి అభిప్రాయపడ్డారు. 90వ దశకంలో అత్యంత విజయవంతమైన నటీమణులలో ఒకరిగా మమతా కులకర్ణి పేరుగాంచిన విషయం తెలిసిందే.


More Telugu News