పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం.. డ్రగ్స్‌, ఆయుధాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు

  • అమృత్‌సర్ రూరల్ పోలీసుల మెరుపు దాడి
  • 42,983 కిలోల హెరాయిన్‌, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక స్టార్ మార్క్ పిస్టల్‌, 46 లైవ్ బుల్లెట్లు స్వాధీనం
  • వివరాలు ఎక్స్ వేదికగా పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడి
పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున సాగుతున్న మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా కుట్రను భగ్నం చేశారు. విలేజ్ డిఫెన్స్ కమిటీ (వీడీసీ) నుంచి అందిన కీలక సమాచారంతో అమృత్‌సర్ రూరల్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించి భారీ మొత్తంలో హెరాయిన్‌తో పాటు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 

ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా వెల్లడించారు. దాడుల్లో మొత్తం 42,983 కిలోల హెరాయిన్‌, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక స్టార్ మార్క్ పిస్టల్‌, 46 లైవ్ బుల్లెట్లు, అలాగే నిందితులు వదిలివెళ్లిన ఒక మోటార్‌సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

విలేజ్ డిఫెన్స్ కమిటీ సభ్యుల అప్రమత్తత వల్లే ఈ భారీ స్మగ్లింగ్‌ ప్రయత్నాన్ని అడ్డుకోవడం సాధ్యమైందని పోలీసులు పేర్కొంటూ, వారి సహకారాన్ని ప్రశంసించారు. ఈ ఘటనకు సంబంధించి అమృత్‌సర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేయగా, పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 

స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌, ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వీటి వెనుక పనిచేస్తున్న అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్ ఏమిటి? అన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే ఇలాంటి కుట్రల వెనుక ఉన్న అసలు సూత్రధారులను త్వరలోనే పట్టుకుంటామని డీజీపీ గౌరవ్ యాదవ్ స్పష్టం చేశారు. 


More Telugu News