భర్తపై కోపంతో పసికందును వదిలివెళ్లిన భార్య

  • భార్య శ్రావణిని వదిలించుకునే ఉద్దశంతో దువ్వాడ రైల్వే స్టేషన్‌ వద్ద రైలు దిగి వెళ్లిన భర్త అర్జున్ 
  • మనస్తాపంతో ఐదు నెలల పసికందును ఆటోలో వదిలివెళ్లిన శ్రావణి
  • బాలుడి తల్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విశాఖ ఆర్పీఎఫ్ పోలీసులు
భర్త తనను విడిచిపెట్టేశాడన్న కోపంతో ఐదు నెలల పసికందును రైల్వే స్టేషన్‌ సమీపంలో ఆటోలో వదిలేసిన తల్లి ఘటన స్థానికంగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఉపాధి నిమిత్తం గత ఏడాది శ్రావణి, అర్జున్‌ దంపతులు విజయవాడకు వెళ్లారు. అయితే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగడంతో వారి దాంపత్య జీవితం గందరగోళంగా మారింది. విజయవాడలో పనులు సరిగా లేకపోవడంతో ఇద్దరూ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలులో విశాఖపట్నం బయలుదేరారు.
 
ఈ ప్రయాణంలో భార్యను వదిలించుకునే ఉద్దేశంతో దువ్వాడ రైల్వే స్టేషన్‌ వద్ద భర్త అర్జున్‌ రైలు దిగిపోయినట్లు తెలుస్తోంది. ఎంత వెతికినా భర్త ఆచూకీ లభించకపోవడంతో తనను ఉద్దేశపూర్వకంగానే వదిలేశాడని శ్రావణి భావించినట్లు సమాచారం. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న అనంతరం తీవ్ర మనస్తాపానికి లోనైన శ్రావణి, ఐదు నెలల పసికందును ఓ ఆటోలో వదిలేసి సమీపంలోని ఓ కాంప్లెక్స్‌ వైపు వెళ్లిపోయింది. 

ఆటోలో పసికందు ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన డ్రైవర్లు వెంటనే ఆర్పీఎఫ్‌ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్పీఎఫ్‌ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా బాలుడి తల్లిని గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.


More Telugu News