అనసూయకు గుడి కడతాడట.. పర్మిషన్ అడుగుతున్న పూజారి
- ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అనసూయ
- అనసూయకు గుడి కడతానంటున్న మురళీశర్మ
- ఖుష్బూకు గుడి కట్టిన తరహాలోనే అనసూయకు గుడి కాడతామని వ్యాఖ్య
టాలీవుడ్లో గ్లామరస్ నటిగా మాత్రమే కాకుండా, బలమైన నటనతో అందరి మనసులను అనసూయ గెలిచింది. యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఆమె సినీ రంగంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇప్పుడు కొంతమంది ఆమెకు గుడి కట్టడానికి కూడా సిద్ధమవుతున్నారు. అనసూయ పర్మిషన్ ఇస్తే ఏకంగా ఆమెకు గుడి కట్టేస్తామని పూజారి మురళీశర్మ బహిరంగంగా ప్రకటించడం సంచలనంగా మారింది. తమిళనాడులో నటి ఖుష్బూకు గుడి కట్టిన తరహాలోనే అనసూయకు కూడా ఆలయం నిర్మిస్తామని ఆయన ధీమాగా చెప్పారు.
ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మురళీశర్మ మాట్లాడుతూ, "అనసూయ అంటే నాకు అపారమైన గౌరవం. ఆమె పర్మిషన్ ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని గుడి కడతాం. ఖుష్బూకు గుడి లాగే అనసూయకు కూడా ఆలయం నిర్మిస్తాం" అని స్పష్టంగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇటీవల శివాజీ-అనసూయ వివాదంలో కూడా మురళీశర్మ అనసూయ వ్యాఖ్యలకు మద్దతు ప్రకటించారు. ఆమెకు మద్దతుగా మాట్లాడుతూ వీడియోలు రిలీజ్ చేశారు. అనసూయ అభిమాన సంఘం అధ్యక్షుడిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. మరి, మురళీశర్మ విన్నపం పట్ల అనసూయ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.