ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నా: హీరోయిన్ ఈషా రెబ్బా

  • తరుణ్ భాస్కర్ తో ఇషా రిలేషన్ లో ఉందంటూ వార్తలు
  • ఆ వార్తల్లో నిజం లేదన్న ఈషా రెబ్బా
  • ఒక వ్యక్తితో డేటింగ్ ప్రారంభ దశలో ఉందని వెల్లడి

టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా, దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ మధ్య ప్రేమ, పెళ్లి రూమర్స్ గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో, మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత దీపావళి పండుగా సందర్భంగా వీరు ఫ్రెండ్స్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలు వైరల్ కావడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో, ఈషా తనపై వస్తున్న వార్తలపై స్పందించింది.


ఈషా హీరోయిన్‌గా, తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన కొత్త చిత్రం 'ఓం శాంతి శాంతి శాంతిః' ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రమోషన్స్ సందర్భంగా ఈషా మాట్లాడుతూ, ఈ రూమర్స్ పై స్పందించింది. "జరుగుతున్న ప్రచారం నిజం కాదు" అని ఆమె స్పష్టం చేసింది. తన తండ్రి కూడా ఈ వార్తలు చూసి "పెళ్లెప్పుడు?" అని అడిగారని చెప్పింది. 


అయితే, తాను ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నానని తెలిపింది. కానీ, అది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని చెప్పింది. అయితే, ఆ వ్యక్తి తరుణ్ భాస్కరా? కాదా? అన్నది మాత్రం స్పష్టం చేయలేదు.



More Telugu News