భారత్, ఈయూ మధ్య చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం.. తగ్గనున్న కార్ల ధరలు!
- విజయవంతమైన భారత్ ప్రపంచానికి ఎంతో మేలు చేస్తుందన్న ఈయూ అధ్యక్షురాలు
- భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందానికి రంగం సిద్ధం
- ఈ ఒప్పందంతో 200 కోట్ల మందితో అతిపెద్ద మార్కెట్ ఏర్పాటు
- యూరప్ నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలు భారీగా తగ్గే అవకాశం
రేపు ప్రధాని మోదీతో జరగనున్న శిఖరాగ్ర సమావేశంలో భారత్, 27 దేశాల యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై చర్చలు ముగిసినట్లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఒప్పందాన్ని "అన్ని ఒప్పందాలకూ తల్లిలాంటిది" (mother of all deals) అని, "చరిత్రాత్మక ఒప్పందం" అని ఉర్సులా గతంలో అభివర్ణించారు. ఈ ఒప్పందం ద్వారా దాదాపు 200 కోట్ల జనాభాతో కూడిన అతిపెద్ద మార్కెట్ ఏర్పడుతుందని, ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు నాలుగో వంతు అని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం యూరోపియన్ యూనియన్... భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇరుపక్షాల మధ్య వస్తు వాణిజ్యం 135 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ వాణిజ్య ఒప్పందం కోసం 2007లో చర్చలు ప్రారంభమైనా, 2013లో నిలిచిపోయాయి. 2022లో ఈ చర్చలను తిరిగి ప్రారంభించారు.
ఈ ఒప్పందంలో భాగంగా యూరప్ నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలను భారీగా తగ్గించడానికి భారత్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 110శాతం వరకు ఉన్న పన్నును తొలుత 40 శాతానికి, ఆ తర్వాత దశలవారీగా 10 శాతానికి తగ్గించనున్నట్లు సమాచారం. ఇది వోక్స్వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్ల కంపెనీలకు భారత మార్కెట్లో ప్రవేశాన్ని మరింత సులభతరం చేస్తుంది. దీంతో భవిష్యత్తులో యూరప్ కార్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.