ఇంట్లో చలిమంటతో ప్రాణాలకే ముప్పు... అధ్యయనంలో కీలక విషయాలు

  • ఇంట్లో కట్టెలు కాల్చడం వల్ల వాయు కాలుష్యం
  • దీనివల్ల ఏటా వేల సంఖ్యలో అకాల మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడి
  • శీతాకాలంలో 22 శాతం PM2.5 కాలుష్యానికి ఇదే కారణమని అధ్యయనం
  • ఈ కాలుష్యం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతుందని హెచ్చరిక
  • కట్టెలకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలు వాడాలని నిపుణుల సూచన
చలికాలంలో వెచ్చదనం కోసం ఇంట్లో కట్టెలు కాల్చి చలిమంటలు వేసుకోవడం చాలామందికి అలవాటు. అయితే, ఈ చిన్నపాటి ఆనందం వెనుక తీవ్రమైన ఆరోగ్య ప్రమాదం దాగి ఉందని, ఇది వాయు కాలుష్యానికి పెద్ద కారణమవుతోందని, చివరికి అకాల మరణాలకు కూడా దారితీస్తుందని ఒక తాజా అధ్యయనం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 'సైన్స్ అడ్వాన్సెస్' అనే ప్రముఖ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన, నివాస ప్రాంతాల్లో కట్టెలు కాల్చడం వల్ల కలిగే నష్టాలను కళ్లకు కట్టింది.

అమెరికాలోని నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధకులు నేతృత్వం వహించిన ఈ అధ్యయనం ప్రకారం, చలికాలంలో గాలిలో పేరుకుపోయే అత్యంత ప్రమాదకరమైన సూక్ష్మ ధూళి కణాల (PM2.5) కాలుష్యంలో దాదాపు 22 శాతం కేవలం ఇళ్లలో కట్టెలు కాల్చడం వల్లే వెలువడుతోంది. అత్యంత చల్లని నెలల్లో వాయు కాలుష్యానికి ఇదే అతిపెద్ద కారణాల్లో ఒకటిగా నిలుస్తోందని పరిశోధకులు తేల్చారు. 

మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ కాలుష్యం కారణంగా ఒక్క అమెరికాలోనే ఏటా సుమారు 8,600 మంది అకాల మరణం చెందుతున్నారని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో, వెచ్చదనం కోసం కట్టెలకు బదులుగా ప్రత్యామ్నాయ, సురక్షితమైన ఉపకరణాలను వాడాలని వారు సూచిస్తున్నారు. దీనివల్ల గాలిలోని సూక్ష్మ ధూళి కణాలను గణనీయంగా తగ్గించవచ్చని, తద్వారా గుండె సంబంధిత వ్యాధుల ముప్పును కూడా నివారించవచ్చని తెలిపారు.

ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన అసోసియేట్ ప్రొఫెసర్ డేనియల్ హోర్టన్ మాట్లాడుతూ, "కార్చిచ్చుల వల్ల కలిగే ఆరోగ్య నష్టాల గురించి మనం తరచుగా వింటుంటాం. కానీ, మన ఇళ్లలో వెచ్చదనం కోసం కట్టెలు కాల్చడం వల్ల ఎదురయ్యే పరిణామాలను పెద్దగా పట్టించుకోం. చాలా తక్కువ సంఖ్యలో ప్రజలు మాత్రమే వేడి కోసం కట్టెలపై ఆధారపడతారు. కాబట్టి, వారిని పొగ రాని లేదా శుభ్రమైన ఇంధన వనరుల వైపు మళ్లించగలిగితే, వాయు నాణ్యతలో ఊహించని స్థాయిలో మెరుగుదల కనిపిస్తుంది" అని వివరించారు. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు ఇళ్లలోని ఫర్నెస్ లు, బాయిలర్లు, ఫైర్‌ప్లేస్‌లు, పొయ్యిల నుంచి వెలువడే పొగను విశ్లేషించారు.

అత్యంత అధునాతన అట్మాస్ఫియరిక్ మోడల్‌ను ఉపయోగించి, ఈ కాలుష్యం గాలిలో ఎలా కలుస్తుందో, ఎంత దూరం ప్రయాణిస్తుందో అనుకరణ (సిమ్యులేషన్) చేశారు. వాతావరణ పరిస్థితులు, గాలి వేగం, ఉష్ణోగ్రత, భౌగోళిక పరిస్థితులు, వాతావరణంలోని రసాయన చర్యలను పరిగణనలోకి తీసుకుని గాలి నాణ్యతను అంచనా వేశారు. కట్టెల పొగ నుంచి వెలువడే బ్లాక్ కార్బన్ వంటి కొన్ని కణాలు నేరుగా కాలుష్యం కలిగిస్తే, మరికొన్ని వాతావరణంలోని ఇతర మూలకాలతో కలిసి మరింత ప్రమాదకరమైన ద్వితీయ కాలుష్య కణాలుగా మారతాయని హోర్టన్ తెలిపారు. 

ముఖ్యంగా నగరాలు, శివారు ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని, జనసాంద్రత, పొగ సాంద్రత, గాలి ప్రవాహం వంటి అంశాలన్నీ కలిసి తీవ్ర ప్రభావం చూపుతున్నాయని కనుగొన్నారు. శివారు ప్రాంతాల్లో వెలువడిన పొగ, జనసాంద్రత అధికంగా ఉండే నగర కేంద్రాల్లోకి ప్రయాణించి అక్కడి ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ కుటుంబం ఇలాగే చలి నుంచి రక్షణ కోసం నిప్పుల కుంపటి వెలిగించింది. అయితే, వారు నిద్రిస్తున్న సమయంలో ఆ కుంపటి నుంచి వెలువడిన పొగ వారి ప్రాణాలను బలిగొంది. 



More Telugu News