Manoj Tiwary: కెప్టెన్‌గా గిల్ ఫెయిల్.. ప్రపంచకప్ గెలవాలంటే రోహితే సార‌థిగా స‌రైనోడు: మనోజ్ తివారీ

Manoj Tiwary Demands Rohit Sharma Back as ODI Captain for 2027 World Cup
  • గిల్ సారథ్యంలో టీమిండియా వరుసగా రెండు వన్డే సిరీస్‌లు కోల్పోయిన నేపథ్యంలో విమర్శలు 
  • వన్డే కెప్టెన్సీ నుంచి శుభ్‌మన్ గిల్‌ను తొలగించాలని డిమాండ్
  • రోహిత్ శర్మను తిరిగి కెప్టెన్‌గా నియమించాలని సూచించిన మనోజ్ తివారీ
  • రోహిత్ కెప్టెన్సీలో ప్రపంచకప్ గెలిచే అవకాశాలు 85-90 శాతం ఉంటాయని వ్యాఖ్య
భారత వన్డే జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను వెంటనే తొలగించి, ఆ బాధ్యతలను తిరిగి రోహిత్ శర్మకు అప్పగించాలని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ డిమాండ్ చేశాడు. గిల్ సారథ్యంలో టీమిండియా వరుసగా రెండు వన్డే సిరీస్‌లు కోల్పోయిన నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటికైనా నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించాడు.

2025 అక్టోబర్‌లో రోహిత్ శర్మ స్థానంలో వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన గిల్, ఆస్ట్రేలియా పర్యటనలో తన తొలి సిరీస్‌లోనే ఓటమిని చవిచూశాడు. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ భారత్ ఓడిపోయింది. దీంతో గిల్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ తివారీ కీలక వ్యాఖ్యలు చేశాడు.

"ఇది కేవలం ద్వైపాక్షిక సిరీస్ గురించి కాదు, రాబోయే 2027 ప్రపంచకప్ గురించి ఆలోచించాలి. అందుకే ఇప్పటికైనా మార్పులు చేయడానికి సమయం ఉందని నేను సూచిస్తున్నాను. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రోహిత్ కెప్టెన్‌గా ఉండుంటే ఫలితం కచ్చితంగా వేరేలా ఉండేది" అని తివారీ అభిప్రాయపడ్డాడు.

"కెప్టెన్సీ విషయంలో గిల్‌తో పోలిస్తే రోహిత్ శర్మ కొంచెం కాదు, చాలా మెరుగైనవాడు. అందుకే అతను అంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. రోహిత్ కెప్టెన్‌గా ఉంటే ప్రపంచకప్ గెలిచే అవకాశాలు 85 నుంచి 90 శాతం ఉంటాయి. అదే గిల్ అయితే ఆ అవకాశం ఎంత ఉంటుందో అందరూ అంచనా వేయగలరు" అని తివారీ ఘాటుగా వ్యాఖ్యానించాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ను తొలిసారి కోల్పోవడంతో గిల్ కెప్టెన్సీపై బీసీసీఐ పునరాలోచన చేయాలన్న ఒత్తిడి పెరుగుతోంది.
Manoj Tiwary
Shubman Gill
Shubman Gill captaincy
Rohit Sharma
India vs New Zealand
ODI series
2027 World Cup
BCCI
Indian Cricket Team

More Telugu News