సునీతా విలియమ్స్‌ను క‌లిసిన‌ ప్రకాశ్ రాజ్.. అద్భుతమైన క్షణమంటూ పోస్ట్

  • ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో నటుడు ప్రకాశ్ రాజ్ భేటీ
  • కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో కలుసుకున్న వైనం 
  • ఇదొక అద్భుతమైన క్షణమంటూ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసిన న‌టుడు
  • ఇటీవలే నాసా నుంచి రిటైర్ అయిన సునీతా విలియమ్స్
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను కలిశారు. ఈ అరుదైన భేటీ తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని, అదొక మర్చిపోలేని క్షణమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కేరళలోని కోజికోడ్‌లో జరిగిన కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో వీరిద్దరూ కలుసుకున్నారు.

సునీతా విలియమ్స్‌తో దిగిన ఫొటోలను తన ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతాలో పంచుకున్న ప్రకాశ్ రాజ్.. "ఇదొక మధురమైన క్షణం. మన కాలంలోని ధైర్యవంతురాలైన మహిళ సునీతా విలియమ్స్‌తో మాట్లాడే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ మధుర జ్ఞాపకాలను మీతో పంచుకుంటున్నాను" అని రాసుకొచ్చారు. ఆయన పోస్ట్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంతరిక్ష యానంలో అత్యంత ప్రతిభావంతులైన వ్యోమగాముల్లో ఒకరిగా సునీతా విలియమ్స్ గుర్తింపు పొందారు. సుమారు 27 ఏళ్ల పాటు అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా'లో సేవలందించిన ఆమె, ఇటీవల (2025 డిసెంబర్ 27న) పదవీ విరమణ చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తొమ్మిది నెలల పాటు చారిత్రాత్మక యాత్రను పూర్తి చేసిన తర్వాత ఆమె రిటైర్ అయ్యారు.

ఇక, ప్రకాశ్ రాజ్ సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం పలు భాషల్లో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం 'వారణాసి'లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్‌ను పూర్తి చేశానని, తర్వాతి షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన గతంలో పేర్కొన్నారు.


More Telugu News