ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి

  • మావోయిస్టుల ఏరివేత ముమ్మరం
  • సారండా అడవుల్లో భద్రతా దళాల వేట
  • 2026 మార్చి నాటికి దేశాన్ని మావోయిస్ట్ రహితంగా మార్చాలన్నది కేంద్రం లక్ష్యం
ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సింగ్‌భూం జిల్లాలో భద్రతా దళాలు జరిపిన ఆపరేషన్‌లో 15 మంది మావోయిస్టులు హతమయ్యారు. సారండా అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, సింగ్‌భూం జిల్లాలోని సారండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, సీఆర్‌పీఎఫ్ కోబ్రా బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడటంతో, బలగాలు దీటుగా ప్రతిఘటించాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది.

2026 మార్చి నాటికి దేశాన్ని మావోయిస్ట్ రహితంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సహా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా బలగాలు నిర్మూలన చర్యలను ముమ్మరం చేశాయి. ఝార్ఖండ్‌లో జరిగిన ఈ తాజా ఎన్‌కౌంటర్‌ను కూడా ఈ ఆపరేషన్లలో భాగంగానే అధికారులు చూస్తున్నారు.

మృతుల గుర్తింపు, స్వాధీనం చేసుకున్న ఆయుధాల వివరాలను అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ ఘటనతో మావోయిస్టుల ఏరివేత దిశగా మరో కీలక ముందడుగు పడినట్లయిందని భద్రతా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


More Telugu News