: లండన్ ప్రైమరీ స్కూల్ లో భారత విద్యార్థిపై వివక్ష.. తిలకం పెట్టుకోవడమే కారణం

  • యాజమాన్యం తీరుపై మండిపడుతున్న హిందువులు
  • వివక్ష కారణంగా స్కూలు మారిన బాలుడు
  • ఇలాంటి కారణాలతోనే ఈ స్కూలు వీడిన నలుగురు విద్యార్థులు
తిలకం పెట్టుకుని స్కూలుకు వెళ్లిన ఎనిమిదేళ్ల బాలుడికి వింత పరిస్థితి ఎదురైంది. నుదుట తిలకం చూసి ఇదేం ఆచారమంటూ తోటి పిల్లలతో పాటు టీచర్లు కూడా పదేపదే ఆరాతీస్తూ ప్రత్యేకంగా చూడడంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. బాలుడి పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు ఆ స్కూలు మానిపించేసి మరో స్కూలులో చేర్పించారు. లండన్ లోని ఓ స్కూలులో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
 
లండన్ లోని హిందూ కుటుంబానికి చెందిన బాలుడు ఇటీవల నుదుట తిలకం పెట్టుకుని స్కూలుకు వెళ్లాడు. తిలకంతో వచ్చిన ఆ బాలుడిని తోటి విద్యార్థులు వింతగా చూశారు. టీచర్లు సైతం ఆశ్చర్యంగా బాలుడి మతవిశ్వాసాల గురించి ఆరాతీశారు. పిల్లలంతా ఆడుకునే సమయంలో హెడ్ టీచర్ ఈ బాలుడిపై ప్రత్యేకంగా దృష్టి సారించేవారు. ఈ పరిణామాలతో బాలుడు భయాందోళనలకు గురయ్యాడు. ఈ వివక్ష వల్ల తమ బాబును స్కూలు మార్చాల్సి వచ్చిందని తల్లిదండ్రులు వాపోయారు.

తమ మత విశ్వాసాల గురించి పాఠశాల యాజమాన్యానికి వివరించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయిందని బాలుడి తల్లిదండ్రులు వెల్లడించారు. ఈ ఘటనపై స్థానికంగా హిందువులు తీవ్రంగా ఆక్షేపించారు. గతంలోనూ ఇదే స్కూలు నుంచి దాదాపు ఇవే ఆరోపణలతో నలుగురు విద్యార్థులు వేరే స్కూలులో చేరారని సమాచారం.

More Telugu News