: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో భారీ మార్పులు.. కోహ్లీ, రోహిత్‌లకు గ్రేడ్ 'బీ'?

  • బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల విధానంలో కీలక మార్పులకు రంగం సిద్ధం
  • ప్రస్తుతమున్న 'ఏ+' కేటగిరీని రద్దు చేయాలని సెలక్షన్ కమిటీ ప్రతిపాదన
  • కొత్త విధానం అమలైతే కోహ్లీ, రోహిత్‌లకు గ్రేడ్ 'బీ' దక్కే అవకాశం
  • వన్డేలకు మాత్రమే పరిమితం కావడంతో ఈ నిర్ణయానికి యోచన
  • బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం
ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టుల విధానంలో కీలక మార్పులు తీసుకురావడానికి బీసీసీఐ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కొత్త విధానం అమల్లోకి వస్తే, టీమిండియా సీనియర్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గ్రేడ్ 'బీ'కి పరిమితమయ్యే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాల స‌మాచారం.

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, ప్రస్తుత కాంట్రాక్టుల నిర్మాణంలో మార్పులు చేయాలని బోర్డుకు ప్రతిపాదించింది. దీని ప్రకారం అత్యధిక పారితోషికం ఉండే 'ఏ+' (రూ.7 కోట్లు) కేటగిరీని పూర్తిగా రద్దు చేయాలని సూచించింది. దాని స్థానంలో ఏ, బీ, సీ అనే మూడు గ్రేడ్లను మాత్రమే కొనసాగించాలని ప్రతిపాదనలో పేర్కొంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కేవలం వన్డే ఫార్మాట్‌కు మాత్రమే ఆడుతున్నందున ఈ కొత్త విధానం ఆమోదం పొందితే వారిని గ్రేడ్ బీలో చేర్చే అవకాశాలున్నాయని సమాచారం.

ప్రస్తుత కాంట్రాక్టుల విధానంలో గ్రేడ్ 'ఏ+' ఆటగాళ్లకు రూ.7 కోట్లు, గ్రేడ్ 'ఏ' వారికి రూ.5 కోట్లు, గ్రేడ్ 'బీ' వారికి రూ.3 కోట్లు, గ్రేడ్ 'సీ' వారికి రూ.1 కోటి చొప్పున బీసీసీఐ వార్షిక పారితోషికం చెల్లిస్తోంది. 2024-25 జాబితాలో రోహిత్, విరాట్‌లతో పాటు జడేజా, బుమ్రా 'ఏ+' కేటగిరీలో ఉన్నారు.

ఈ కొత్త ప్రతిపాదనపై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ తదుపరి సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశం తర్వాతే పారితోషికాల్లో మార్పులపై, కొత్త విధానం అమలుపై పూర్తి స్పష్టత రానుంది.

More Telugu News