ప్రేమ పేరుతో మోసం... గుంటూరులో ఎస్ఐకి పదేళ్ల జైలుశిక్ష

  • గుంటూరు నగరంపాలెం ఎస్ఐగా పని చేస్తున్న సమయంలో ఓ నర్సును ప్రేమ పేరుతో మోసం చేసిన రవితేజ
  • బాధితురాలి ఫిర్యాదుతో ఎస్ఐ‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు
  • నిందితుడిపై నేరం నిరూపణ కావడంతో శిక్ష విధించిన గుంటూరు న్యాయస్థానం
ప్రేమ పేరుతో యువతిని మోసగించిన కేసులో ఒక పోలీసు అధికారికి న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. గుంటూరు నాల్గవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయాధికారి శరత్‌కుమార్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. ఈ తీర్పు ఉమ్మడి గుంటూరు జిల్లాలో సంచలనం రేపింది.

ప్రస్తుతం బాపట్ల జిల్లా అమృతలూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న కె. రవితేజ గతంలో గుంటూరు జిల్లా నగరంపాలెం ఎస్‌ఐగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో నర్సుగా పనిచేస్తున్న ఒక యువతిని ప్రేమ పేరుతో మోసం చేసినట్లు అతనిపై ఆరోపణలు వచ్చాయి.

2023లో బాధిత యువతి నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎస్‌ఐ రవితేజపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో పాటు అత్యాచార కేసును నమోదు చేశారు. కేసు నమోదు కావడంతో అప్పటి నుంచి ఆ ఎస్ఐ విధులకు గైర్హాజరు కావడంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు.

ఈ కేసుపై గుంటూరు కోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. విచారణలో ఎస్ఐ ప్రేమ పేరుతో యువతిని మోసం చేసినట్లు నిర్ధారణ కావడంతో న్యాయస్థానం ఎస్‌ఐ రవితేజకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 


More Telugu News