తొలిరోజే వందేభారత్ ట్రైన్ లో చెత్త.. వీడియో ఇదిగో!

  • ప్రతీ కోచ్ లో డస్ట్ బిన్ ఏర్పాటు.. అయినా సీటు దగ్గరే చెత్త పడేసిన ప్రయాణికులు
  • వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ తప్పెవరిదంటూ ప్రశ్నించిన ఓ ప్రయాణికుడు
  • సివిక్ సెన్స్ లేదంటూ తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్లు
ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పిస్తుంటే వాటిని సరిగ్గా వాడుకోలేకపోతున్నాం.. కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాం.. అంటూ రైల్వే ప్రయాణికుడు ఒకరు సోషల్ మీడియాలో వాపోయాడు. వందే భారత్ స్లీపర్ ట్రైన్ లో తొలిరోజు ప్రయాణించిన విశేషాలు చెబుతూ.. ఓ కంపార్ట్ మెంట్లో తోటి ప్రయాణికులు పడేసిన చెత్తను వీడియోలో చూపిస్తూ ఇది ఎవరి తప్పని ప్రశ్నించాడు. కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రీమియం స్లీపర్ క్లాస్ ట్రైన్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన రైల్వే శాఖదా.. ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించాలని ప్రయత్నించిన ప్రభుత్వానిదా.. అందుబాటులోకి వచ్చిన సదుపాయాన్ని సరిగ్గా వినియోగించుకోలేని మనదా.. ఎవరిది తప్పు? అంటూ నిలదీశాడు.

అసలు ఏం జరిగిందంటే..
హౌరా- గువాహటి మధ్య వందేభారత్ తొలి స్లీపర్ ట్రైన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలిరోజు అందులో ప్రయాణించిన కొందరు ఐస్ క్రీం తినేసి కప్పులను, వాటర్ బాటిల్, టిష్యూ పేపర్లను సీటు వద్దే పడేశారు. దీంతో కంపార్ట్ మెంట్ చెత్తకుప్పలా మారింది. కొత్త రైలులో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినా వినియోగించుకోవాలనే తెలివి లేకుండా, కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించారు.

ప్రతీ కోచ్ లో డస్ట్ బిన్ ఏర్పాటు చేసినా కూడా సీట్లో నుంచి లేచి డస్ట్ బిన్ వద్దకు నడవడానికి బద్దకించారు. సదరు కోచ్ లో ప్రయాణికుల నిర్వాకాన్ని తోటి ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వైరల్ గా మారిన ఈ వీడియో చూసిన మనకు సివిక్ సెన్స్ అస్సలు లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. పబ్లిక్ ప్రాపర్టీని శుభ్రంగా ఉంచుకోవాలనే కనీస స్పృహ లేదని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News