కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో భీకర ఎన్‌కౌంటర్.. 8 మంది సైనికులకు గాయాలు

  • సోనార్ గ్రామంలో దాక్కున్న జైష్ ఉగ్రవాదులు
  • భద్రతా బలగాలపై ఒక్కసారిగా కాల్పులు 
  • గ్రెనేడ్ల దాడిలో చాలామంది సైనికులకు గాయాలు
  • డ్రోన్లు, స్నిఫర్ డాగ్‌లతో ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న భారీ సెర్చ్ ఆపరేషన్
జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఆదివారం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది సైనికులు గాయపడ్డారు. ఛత్రూ ప్రాంతంలోని సోనార్ గ్రామంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసులు సంయుక్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.

గ్రామాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేస్తుండగా ఓ చోట నక్కిన ముగ్గురు ఉగ్రవాదులు భద్రతా బలగాలపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. భద్రతా వలయం నుంచి తప్పించుకునేందుకు గ్రెనేడ్లు కూడా విసిరారు. వీరు పాకిస్థాన్‌కు చెందిన జైష్-ఏ-మొహమ్మద్ (JeM) సంస్థకు చెందినవారని అధికారులు భావిస్తున్నారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. సాయంత్రం 5:40 గంటల వరకు ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగాయి.

ఉగ్రవాదులు విసిరిన గ్రెనేడ్ల కారణంగా ఎనిమిది మంది సైనికులు గాయపడగా, వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించి, ఉగ్రవాదుల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. డ్రోన్లు, స్నిఫర్ డాగ్‌ల వంటి ఆధునిక నిఘా పరికరాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

జమ్మూ ప్రాంతంలో ఈ ఏడాది ఇది మూడో ఎన్‌కౌంటర్. గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో జమ్మూలోని కొండ ప్రాంతాల్లో భద్రతా ఆపరేషన్లను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే తాజా ఆపరేషన్ కొనసాగుతోంది.


More Telugu News