మంటగలిసిన మానవత్వం.. ఈ రెండు ఘటనలే నిదర్శనం

  • భార్య నిప్పంటించుకుంటే కాపాడకుండా వీడియో తీసిన భర్త
  • బీహార్‌లో బాలుడిని ఢీకొట్టి బోల్తాపడ్డ చేపల లారీ
  • పిల్లవాడిని పట్టించుకోకుండా చేపల కోసం ఎగబడ్డ జనం
దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు ఘటనలు మానవ విలువలు ఎంతగా పతనమవుతున్నాయో కళ్లకు కడుతున్నాయి. ఓ చోట కళ్లముందే భార్య కాలిపోతున్నా కాపాడాల్సింది పోయి వీడియో తీశాడో భర్త. మరోచోట ప్రమాదంలో బాలుడు మరణిస్తే, అతడిని పట్టించుకోకుండా జనం చేపల కోసం ఎగబడ్డారు. ఈ అమానవీయ ఘటనలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

గుజరాత్‌లోని సూరత్‌లో రంజిత్ సాహా, ప్రతిమాదేవి దంపతులు నివసిస్తున్నారు. పిల్లల విషయంలో వచ్చిన చిన్న గొడవ పెద్దది కావడంతో, రంజిత్ తన భార్యను ఆత్మహత్య చేసుకోమని రెచ్చగొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన ప్రతిమాదేవి ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆ సమయంలో ఆమెను కాపాడటానికి ప్రయత్నించకుండా, రంజిత్ తన ఫోన్‌లో వీడియో తీస్తూ పైశాచికంగా ప్రవర్తించాడు. తీవ్ర గాయాలతో ఆమె జనవరి 11న ఆసుపత్రిలో మరణించింది. ఆమె సోదరుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు రంజిత్ ఫోన్‌లోని వీడియోను చూసి నివ్వెరపోయారు. అతడిని అరెస్ట్ చేసి, భార్య చావుకు కారణమయ్యాడన్న ఆరోపణలపై కేసు నమోదు చేశారు.

ఇలాంటిదే మరో దారుణ ఘటన బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో చోటుచేసుకుంది. కోచింగ్‌కు వెళ్తున్న 13 ఏళ్ల రితేశ్ కుమార్‌ను చేపల లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతిచెందగా, ట్రక్కు బోల్తా పడింది. దీంతో ట్రక్కులోని చేపలన్నీ రోడ్డుపై పడ్డాయి. అక్కడ గుమిగూడిన జనం, రక్తపు మడుగులో పడి ఉన్న బాలుడిని పట్టించుకోకుండా, సంచుల్లో చేపలను నింపుకోవడానికి ఎగబడటం అందరినీ కలిచివేసింది. ఈ రెండు ఘటనలు సమాజంలో మానవత్వం ఏ స్థాయిలో దిగజారిపోయిందో చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.


More Telugu News