మంటగలిసిన మానవత్వం.. ఈ రెండు ఘటనలే నిదర్శనం

  • భార్య నిప్పంటించుకుంటే కాపాడకుండా వీడియో తీసిన భర్త
  • బీహార్‌లో బాలుడిని ఢీకొట్టి బోల్తాపడ్డ చేపల లారీ
  • పిల్లవాడిని పట్టించుకోకుండా చేపల కోసం ఎగబడ్డ జనం
దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు ఘటనలు మానవ విలువలు ఎంతగా పతనమవుతున్నాయో కళ్లకు కడుతున్నాయి. ఓ చోట కళ్లముందే భార్య కాలిపోతున్నా కాపాడాల్సింది పోయి వీడియో తీశాడో భర్త. మరోచోట ప్రమాదంలో బాలుడు మరణిస్తే, అతడిని పట్టించుకోకుండా జనం చేపల కోసం ఎగబడ్డారు. ఈ అమానవీయ ఘటనలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. సూరత్‌లోని ఇచ్ఛాపూర్ ప్రాంతంలో రంజిత్ సాహా (33), ప్రతిమాదేవి (31) దంపతులు తమ ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నారు. వీరు వాస్తవానికి బీహార్‌కు చెందినవారు. జనవరి 4న పిల్లల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రంజిత్.. "నిప్పు అంటించుకుని చావు" అంటూ భార్యను రెచ్చగొట్టాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రతిమాదేవి ఇంట్లో ఉన్న డీజిల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది.

మంటల్లో కాలిపోతూ ఆమె ఆర్తనాదాలు చేస్తున్నా, రంజిత్ చలించలేదు. ఆమెను కాపాడే ప్రయత్నం చేయకుండా, తన మొబైల్ ఫోన్‌తో ఆ దృశ్యాన్ని వీడియో తీయడం ప్రారంభించాడు. అనంతరం ఆమెను ఆసుపత్రిలో చేర్పించగా, జనవరి 11న చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఈ ఘటనపై మృతురాలి సోదరుడు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది. ఇచ్ఛాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రంజిత్ మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా, భార్య ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో తీసిన వీడియో క్లిప్ లభించింది. "తాను నిర్దోషినని నిరూపించుకోవడం కోసమే ఈ వీడియో తీసినట్లు రంజిత్ పోలీసుల విచారణలో చెప్పాడు. అయితే, అతడు తనను తాను కాపాడుకోవడానికి తీసిన వీడియోనే ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యంగా మారింది" అని ఇచ్ఛాపూర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఏసీ గోహిల్ తెలిపారు.

పోలీసులు రంజిత్ సాహాను అరెస్టు చేసి, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 85 (క్రూరత్వం), 108 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద కేసు నమోదు చేశారు. ఈ అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఇలాంటిదే మరో దారుణ ఘటన బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో చోటుచేసుకుంది. కోచింగ్‌కు వెళ్తున్న 13 ఏళ్ల రితేశ్ కుమార్‌ను చేపల లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతిచెందగా, ట్రక్కు బోల్తా పడింది. దీంతో ట్రక్కులోని చేపలన్నీ రోడ్డుపై పడ్డాయి. అక్కడ గుమిగూడిన జనం, రక్తపు మడుగులో పడి ఉన్న బాలుడిని పట్టించుకోకుండా, సంచుల్లో చేపలను నింపుకోవడానికి ఎగబడటం అందరినీ కలిచివేసింది. ఈ రెండు ఘటనలు సమాజంలో మానవత్వం ఏ స్థాయిలో దిగజారిపోయిందో చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.


More Telugu News